అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న ఛార్జ్ షీట్లు 18కి చేరాయి. ఇందూ హోసింగ్ ప్రాజెక్టు కేసులో ఈడీ వేసిన మరో కొత్త ఛార్జ్ షీట్ ను ఈడీ కోర్టు స్వీకరించింది. వైఎస్ హయాంలో ఆయన తోడల్లుడు భాగస్వామిగా ఉన్న ఇందూ ప్రాజెక్ట్స్ కు ఏపీ హౌసింగ్ బోర్డు హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాలలో 135 ఎకరాలను నాటి ప్రభుత్వం భూములు కేటాయించింది.
అందుకు ప్రతిగా ఆయనకు జగన్ కు చెందిన అనేక కంపెనీలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అలాగే జగన్ మేనమామ, ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి రెండెకరాల ప్లాట్ ని కూడా ఇచ్చారు. ఈ ఛార్జ్ షీట్ ను విచారించిన ఈడీ ప్రత్యేక కోర్టు తదుపరి విచారణను జూన్ 30కి వాయిదా వేసింది.
చార్జిషీటులో సీఎం జగన్, శ్యామ్ ప్రసాద్రెడ్డి, జితేంద్ర మోహన్దా విర్వాణి, వైవీ సుబ్బారెడ్డి, వీవీ కృష్ణప్రసాద్, ఇందూ ప్రాజెక్ట్స్, సైబరాబాద్ హైటెక్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ డెవల్పమెంట్ కార్పొరేషన్, ఇందూ ఈస్ట్రన్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్, ఇందూ రాయల్ హోమ్స్, వసంత ప్రాజెక్ట్స్, ఎంబసీ ప్రాపర్టీ డెవల్పమెంట్ ప్రైవేటు లిమిటెడ్ (డైనస్టీ డెవలపర్స్) సంస్థలను నిందితులుగా పేర్కొంది.
ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏమిటంటే… ఇదే ఇష్యూ కు సంబంధించిన సిబిఐ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ, జగన్ ఆడిటర్ విజయసాయి రెడ్డి నిందితుడిగా ఉన్నారు. అయితే ఈడీ వేసిన ఛార్జ్ షీట్లో ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశం అయ్యింది. అది దేనికి సంకేతం అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.



