ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రత్యర్ధి పార్టీలన్నీ గజగజవణికిపోతున్నాయి… ఎప్పుడు సీబీఐ అధికారులు తలుపు తడతారో… ఈడీ, ఐటి అధికారులకు సోదాలకు వస్తారో అని!
ఇది వరకు సీబీఐ, ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిశోడియా, మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ని, వేరే కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కూడా అరెస్ట్ చేసారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు “నా కూతురుని టచ్ చేసి చూడండి’ అని ప్రధాని నరేంద్రమోడీకి సవాల్ విసిరారు. అప్పుడు కేసీఆర్ని చూసి మోడీ కూడా కాస్త భయపడి వెనక్కు తగ్గినా, మొన్న ఈడీని పంపించి ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి పట్టుకుపోతే, కేసీఆర్ చూస్తుండిపోయారు ఏమీ చేయలేక!
కనుక ఇంత మంది హేమాహేమీలను అరెస్ట్ చేసిన సీబీఐ, ఈడీలు, వాటిని కంటి సైగతో శాసించే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు చాలా పవర్ ఫుల్ అని తేలిపోయింది. కానీ వారి శక్తులు ఏవీ ఏపీలో మాత్రం పనిచేయవని వివేకా హత్య కేసులో తేలిపోయింది.
ఇంతమంది ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయగలిగిన సీబీఐ, తాము అరెస్ట్ చేయాలనుకొంటున్న వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి తరచూ హైదరాబాద్లోని తమ కార్యాలయానికి వచ్చి పలకరించి వెళుతున్నా, అరెస్ట్ చేయలేకపోతున్నాయంటే సీబీఐ కంటే అవినాష్ రెడ్డి చాలా పవర్ ఫుల్ అని అర్దమవుతోంది.
అవినాష్ రెడ్డిని టచ్ చేయలేకపోతున్న సీబీఐ అధికారులు ఇప్పుడు విశాఖ పోర్టులోని డ్రగ్స్ కంటెయినర్ వ్యవహారంలో ఏదో చేసేస్తారనుకోలేము. ఎందుకంటే ఆ కంటెయినర్ వైసీపి రాజధానిలోనే ఉంది కనుక.
కనుక ఈ కేసులో కూడా వేడి చల్లబడే వరకు సీబీఐ కాస్త హడావుడి చేసి వెళ్లిపోతే, ఆ తర్వాత ఓం భీమ్ బుష్ అంటూ ఆ కంటెయినర్ మాయం అయిపోయినా ఆశ్చర్యం లేదు. అయినా వేలకోట్లు ఖర్చు చేసి తెప్పించిన సరుకుని ఎవరైనా వదిలేసుకోరు కదా?




