కొందరికి సహజంగానే దైవభక్తి ఉంటుంది. కొందరికి సమాజం కోసం భక్తి పాటించాల్సి వస్తుంది. కనుక సహజంగా ఏర్పడే భక్తికి, సమాజం, పాపభీతి లేదా మరో కారణంతో ఏర్పడే భక్తికి చాలా తేడా ఉంటుంది.
సంపూర్ణ భక్తిభావం కలిగినవారికి మాత్రమే ఆ దైవభక్తిలో తన్మయత్వం పొందగలుగుతారు. కానీ ఇతర కారణాలతో భక్తిని పాటిస్తున్నప్పుడు ఆ తన్మయత్వం లభించదు. కనుక అలాంటి అనుభూతి పొందమని అనుకుంటూ అందరికీ అది తెలియజేసే ప్రయత్నం చేస్తుంటారు. గుడి, మసీదు, చర్చికి వెళ్ళినప్పుడు సేల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం అటువంటిదే.
సహజంగా భక్తిభావం కలగనప్పుడు, అందుకు వేరే మార్గంలో ప్రయత్నించాలి. కానీ భగవంతుడిపై నమ్మకం, భక్తి లేనప్పుడు బలవంతంగా భక్తి కల్పించుకోవడం దేనికి?అవసరమా? అనిపించవచ్చు. నిజమే! బలవంతపు పెళ్ళి మంచిది కాదు. ఫలించదు కూడా!
కానీ ప్రతీ మనిషికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అప్పుడు దేవుడి పట్ల నమ్మకం లేదని చెప్పుకునేవారు సైతం తప్పకుండా ఓసారి ఆకాశం వైపు చూస్తారు!ఎందుకంటే పైన దేవుడున్నాడని మనసు పొరల్లో ఎక్కడో నమ్మకం ఉండబట్టే!
కానీ అలా ఆకాశం చూడకూడదనుకుంటే మనకి చాలా ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యం, ఒంటరిగా పోరాడే శక్తి చాలా అవసరం. సాధారణ సమయంలో చాలా మందిలో ఇలాంటి గొప్ప లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. కానీ సమస్యల చుట్టుముట్టిన బలహీన సమయంలో ఆ గొప్ప లక్షణాలే మాయం అయ్యి మనిషి బలహీనుడిగా మారుతాడు. అంటే మహా యోధుడు కర్ణుడుకి కీలక సమయంలో అస్త్రశస్త్రాలు, విద్యలు గుర్తుకు రాక ఓడిపోయినట్లన్న మాట!
కనుక ఏ దేవుడిని నమ్మకపోయినా ఈ చరాచర సృష్టిని ఓ దివ్యశక్తి నడిపిస్తోందనే నమ్మకం ఉంటే చాలు. అది ఏడుకొండల వెంకన్న కావచ్చు. మరో మతం మరో దేవుడు కావచ్చు. ఆ నమ్మకం సమస్యలు ఎదురైనప్పుడు అధిగమించేందుకు అవసరమైన ధైర్యాన్నిస్తుంది. సమస్యలు లేనప్పుడు మానసిక ప్రశాంతత ఇస్తుంది. అంతర్మధనం చేసుకొని పరిపక్వత సాధించేందుకు తోడ్పడుతుంది.
కనుక భక్తికి, నమ్మకానికి మహిమల ప్రదర్శన, ఆడంబరాలు అవసరం లేదు. కానీ మనసులో భక్తి లేదా నమ్మకమనే బీజం వేసుకోగలిగితే చాలు. ఆ నమ్మకమే మనిషిని ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది.







