టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రి మరణానంతరం ఆయన కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన ఆస్తి వివాదాలు మీడియా వేదికగా బహిరంగమయ్యాయి. చక్రి ఆస్తిపాస్తులు తనకే దక్కుతాయని సతీమణి శ్రావణి, తల్లిగా తనకే దక్కాలని తల్లి విద్యావతి పరస్పరం గొడవ పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు వర్గాలు అప్పట్లో హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆ తర్వాత సర్దుమనిగింది అనుకున్న ఈ వివాదం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది.
చక్రి ఆస్తి కోసం ఆయన తల్లి విద్యావతి, భార్య శ్రావణిల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఈ ఘర్షణతో షాక్ తిన్న చక్రి తల్లి విద్యావతి, ఇంటి వద్ద ధర్నాకు దిగారు. చక్రి భార్యగా ఆస్తిపై పూర్తి అధికారం తనకే ఉందని శ్రావణి వాదిస్తుండగా, తల్లిగా తనకూ వాటా ఇవ్వాలని విద్యావతి డిమాండ్ చేస్తోంది. మరి ఈ వివాదం ఎంతదాకా వెళుతుందో గానీ, ఆస్తి కోసం కుటుంబ సభ్యులు చక్రి పరువు తీస్తున్నారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్ట ప్రకారం భర్త తదనంతరం ఆస్తి తదితర హక్కులన్నీ భార్యకే చెందుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.



