ఒకప్పుడు వినాయకచవితి అంటే వీధి వీధి మండపాలు, భజనలు, పూజలు, భక్తుల దర్శనాలు…ఇలా ఆ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మికతతో కనిపించేది. కానీ ఇప్పుడు చవితి పండుగ రూపురేఖలు మారిపోతున్నాయి, మనమే దగ్గరుండి మార్చేరుస్తున్నాం.
ఒకపక్క ఎంతో పవిత్రంగా బొజ్జ గణపతికి పూజలు చేస్తూనే మరోపక్క గణేష్ భజన పాటలకు బదులు సినిమాలో ఐటం సాంగ్స్, యువతులతో అస్లీల నృత్యాలను ప్రోత్సహిస్తూ పండుగ అర్ధాన్ని, పూజ పరమార్ధాన్ని పక్కదారి పట్టిస్తూ గణేష్ మండపాలను అపవిత్రం చేస్తున్న దృశ్యాలు ఎన్నో ఎన్నెన్నో.
ఇటువంటి కార్యక్రమాల విషయంలో పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని నిబంధనలు పెట్టినా ఈ అస్లీలతకు మాత్రం తాళం పడడం లేదు. రాజకీయ పార్టీల జెండాలు పెట్టుకుని మరి ఇటువంటి అస్లీల కార్యక్రమాలకు పాల్పడుతూ రాజకీయ పార్టీలను సైతం ఈ రొచ్చులోకి లాగుతున్నారు నిర్వాహకులు.
పవిత్రమైన భక్తి కార్యక్రమాల ముసుగులో ఇలా డీజే సౌండ్ల తో హోరెత్తిస్తూ, చప్పట్లు, ఈలలు, కేరింతలతో గోలలు చేస్తూ, మద్యం సేవిస్తూ గణపతి మండపారాధన ప్రాంగణాన్ని కాస్త రీకార్డింగ్ డాన్స్ ల కార్యక్రమంగా మారుస్తున్నారు అంటూ స్థానిక ప్రజలు నిర్వాహుకుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం గతంలో ఇటువంటి గానకచేరీలు, అర్ధనగ్న నృత్యాల కు వ్యతిరేకంగా యువతను హెచ్చరించారు. గణపతి మండపారాధన దగ్గర అబ్బని తియ్యని దెబ్బ అంటూ పాటలేంటి అంటూ వారించారు. అయినా కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు.
ఇకనైనా భక్తి ముసుగులో జరిగే ఇటువంటి అస్లీల కార్యక్రమాల మీద ప్రభుత్వం సీరియస్ గా చర్యలు చేపట్టాలని, అధికారులు కూడా ఇటువంటి రీకార్డింగ్ డాన్స్ లు, అర్ధనగ్న నృత్యాలను అరికట్టేలే చర్యలు తీసుకోవాలంటూ ఆధ్యాత్మిక వాదులు కోరుకుంటున్నారు.





