కొమ్మినేని చురకలు.. కేసీఆర్‌కా జగన్‌కా?

KCR Strategy Draws Comparison With Jagan Mohan Reddy’s Politics

ఇవాళ్ళ సాక్షి ఆన్‌లైన్‌ పత్రికలో ‘మౌనమే కేసీఆర్‌ అస్త్రం..’ అంటూ ఓ కొమ్మినేని వారు వ్రాసిన ఓ కథనం వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ పార్టీల మద్య జరిగిన ఘర్షణల విశ్లేషణాత్మకంగా మొదలుపెట్టినా, ‘ఆవు వ్యాసం’లా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం ప్రస్తావన చేయకుండా నిగ్రహించుకోలేకపోయారు.

అయితే శాసనసభ సమావేశాల నుంచి బీఆర్ఎస్‌ సభ్యులను బహిష్కరించడంతో కేసీఆర్‌ వ్యూహం ఫలించినట్లు లేదు (బెడిసి కొట్టింది) అని సున్నితంగా చురక వేశారు. అయితే ఇక్కడ ఆయన విశ్లేషణ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా చురక వేసినట్లే ఉండటం విశేషం.

ADVERTISEMENT

సస్పెన్షన్‌కు గురైన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి సోదరుడికి చెందిన భూముల వద్దకు వెళ్ళి నిరసన తెలిపారు, కానీ ఇలాంటి విషయాలు సభలో చర్చిస్తేనే వాటికి కలిగే ప్రాధాన్యత వేరేగా ఉంటుంది. ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రిపై సభలో ప్రతిపక్షాలు చేసే విమర్శ రికార్డులలో శాశ్వితంగా ఉండిపోతుంది.

సస్పెన్షన్ వలన ఆ అవకాశం కోల్పోయారు. తర్వాత పార్టీ ఆఫీసులో బాధితులతో సమావేశం నిర్వహించి, దానిని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ఫామ్‌హౌసులో తన ఎమ్మెల్యేలతో చేసిన వ్యూహ రచన పెద్దగ ఫలించినట్లు లేదని కొమ్మినేని వారు ఆత్మసాక్షిగా లిఖితపూర్వకంగా చెప్పారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్యాలస్‌లో కూర్చొని సరిగ్గా ఇలాగే చేస్తున్నారు. కనుక కొమ్మినేని వారు వెలిబుచ్చిన ఈ అభిప్రాయాలు ఆయనకీ, 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తాయి కదా?

శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలకు ఎక్కువ విలువ ఉంటుందని, శాసనసభకు వెళ్ళకుండా ఇంట్లో బాధితుల సమావేశాలు, ప్రెస్‌మీట్ల వలన పెద్దగా ఉపయోగం ఉండదని కొమ్మినేని వారు స్వయంగా చెప్పారు. కానీ ఇదే ముక్క జగన్‌కు చెప్పలేకపోతున్నారు.

కేసీఆర్‌ వ్యూహం బెడిసికొట్టడం వలన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు శాసనసభ నుంచి బయటకు వెళ్ళాల్సివచ్చిందన్నారు. కానీ ఇక్కడ శాసనసభలో జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలను ప్రభుత్వం అడ్డుకోలేదు కదా? ఆయనే కుంటిసాకుతో తాను సభకు రాకుండా మొహం చాటేయడమే కాకుండా, పది మంది ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనీయడం లేదు.

కనుక కొమ్మినేని వారు కాస్త ధైర్యం చేసి సజ్జల శల్య సారధ్యంలో అగమ్యంగా దూసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి విషయాలు చెప్తే ఆయనకు, వైసీపీకి చాలా మేలు చేసినవారవుతారు కదా?

కానీ జగన్‌ ఆలోచనలు, కోర్కెలకు అద్దం పట్టే సొంత మీడియాలో పొరుగు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై విశ్లేషిస్తూ, ఈవిధంగా చురకలు వేయడం భావ్యమా?

ADVERTISEMENT
Latest Stories