ఆంధ్రప్రదేశ్ గోదావరి నీటిని దొంగిలించుకుపోతోందని బీఆర్ఎస్ పార్టీ నేతలు వాదించని రోజు లేదు. అయితే ఏపీకి ఎగువనున్న తెలంగాణలో కాళేశ్వరంతో సహా అనేక ప్రాజెక్టులు నిర్మించుకుంటూనే దిగువనున్న ఏపీని నిందించడం బీఆర్ఎస్ పార్టీకి పరిపాటిగా మారింది. ఇలాంటి వాదనలతో ఆ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసి మైలేజ్ పొందుతోంది కనుక అధికార కాంగ్రెస్ కూడా అప్పుడప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించక తప్పడం లేదు.
కానీ గమ్మతైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఆంధ్రాలోని బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు మొదలైతే తెలంగాణలో భారీ వర్షాలు పడుతూ జిల్లాలు నీట మునుగుతుంటాయి.
సముద్రతీరం పక్కనే ఉన్న విశాఖలో ప్రస్తుతం ఈదురుగాలులు వీస్తున్నాయి తప్ప వర్షం పడటం లేదు. కానీ హైదరాబాద్తో సహా తెలంగాణలో పలు జిల్లాలలో నేటి నుంచి రాబోయే రెండు మూడు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది.
ఇప్పటికే పలు జిల్లాలు నీట మునుగుతున్నాయి. వర్షం కారణంగా ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో ఐటి ఉద్యోగులను త్వరగా ఇంటికి పంపించేయాలని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ విజ్ఞప్తి చేశారు.
ఈరోజు రాత్రి భారీ వర్షం కురిస్తే హైదరాబాద్ మరోసారి నీట మునుగుతుంది. ఇది హైదరాబాద్ని కించపరచడానికి అన్న మాట కాదు. వాస్తవమని బీఆర్ఎస్ నేతలకు తెలుసు.
గట్టిగా వాన పడితే వరద నీటిని ఎక్కడకి మళ్ళించి భద్రపరుచుకోవాలో తెలీని పరిస్థితి నెలకొని ఉంది. తెలంగాణలో పల్లెలు, పట్టణాలు, పంటలు, రోడ్లు అన్నీ నీట మునిగిపోతున్నా కూడా ఇంకా నీళ్ళ కోసం ఆరాటమే. నీళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, పాలకులను నిందిస్తూనే ఉన్నారు. ఉంటారు.
అలా నిందించే బదులు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న ఈ వరద నీటిని ఎక్కడికక్కడ కాలువలు నిర్మించుకొని రిజర్వాయర్లకు మళ్ళించుకోవచ్చు కదా? హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రధాన జంక్షన్ల వద్ద వరద నీటిని సేకరించేందుకు భూగర్భ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించినట్లు, తెలంగాణ అంతటా నిర్మించుకోవచ్చు కదా?వచ్చిన వరదని వాడుకోకుండా రాజకీయాల కోసం ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ని నిందిస్తూనే ఉండాలా?




