రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఆ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయాల కోసమే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడని ఆరోపణలు గుప్పించారు ఆయన రాజకీయ ప్రత్యర్ధులు. కానీ ఆయన ఏకంగా హరిహర వీరమల్లు సినిమాలో అప్పటి మొగలుల దమన కాండను చూపిస్తూ సనాతన ధర్మం కోసం పోరాడిన హరిహర వీరమల్లు లాంటి పాత్రలో కనిపించడంతో సనాతన ధర్మం గురించి మరింత చర్చ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన హరిహర వీరమల్లు సినిమాని క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టారు. జ్యోతి కృష్ణ పూర్తి చేసిన ఈ సినిమాని ఏఎం రత్నం, దయాకర్ రావు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. సినిమాలో పవన్ కళ్యాణ్ పోషించిన వీరమల్లు పాత్ర సనాతన ధర్మం కోసం నిలబడిన తీరు గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అప్పటి మొగలుల దుశ్చర్యలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ, వాటిని ఎదుర్కొనేందుకు అప్పటి వీరులు ఎలా ఇబ్బందులు పడ్డారు, చివరికి వాటిని ఎలా అధిగమించారు అనే విషయాన్ని చూపించిన తీరు కచ్చితంగా అభినందనీయం.
పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఇలాంటి సబ్జెక్ట్ చెప్పకపోతే ఇంక ఏ హీరో చెప్పలేకపోవచ్చు. కేవలం పవన్ కళ్యాణ్ కాబట్టి ఈ సినిమాలో సనాతన ధర్మం విశిష్టతను చాటి చెప్పడమే కాక, ధర్మం కోసం కచ్చితంగా ప్రతి ఒక్కరూ నిలబడాలనే విషయాన్ని ఆయన సినిమా అనే ఒక బలమైన మాధ్యమం ద్వారా చెప్పినట్లయింది.






