భారత దేశంలోని క్రికెట్ అనే ఆట పుట్టకపోయినా, ఆ ఆటను ఒక మతంలా చేసుకుంది మాత్రం భారత దేశమే. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఇంట్లోనూ క్రికెట్ పిచ్చి ఉన్నవారు ఒక్కరైనా ఉంటారు. ఈ ఆటను వీక్షించే వారెందరుంటారో, అలాగే ఆ ఆటను సరదగా, సీరియస్ గా ఆడేవారు కూడా అంతేమంది ఉంటారు.
మరి ఇన్ని కోట్ల మంది జనాభా లో జాతీయ జట్టుకు కేవలం 11 మంది సభ్యులను మాత్రమే ఎంపిక చేయగలరు. సుమారు లక్షలలో ఉన్న ఈ ఆట ఆడే వారందరిని కాదని ఆ 11 మందిని ఎంపిక చేసే ప్రక్రియ ఎంత కఠినమో ఒక్కసారి ఆలోచించాలి.
అయితే ఇదంతా ఒక్కప్పుడు బీసీసీఐ బోర్డు సభ్యులే స్వయంగా చేసేవారు. జరిగే ప్రతి దేశవాళీ టోర్నీలకు హాజరై, అన్ని మ్యాచ్ లను దగ్గరుండి వీక్షించి, వారిలో బాగా ఆడినవారిని, తమ దృష్టిని ఆకర్షించిన వారిని ప్రత్యేకంగా నోట్ చేసుకుని, ఆ ఆటగాళ్లను ఇంటర్నేషనల్ స్థాయిలో కొన్ని అవకాశాలిచ్చి, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ వారికి బ్యాక్-అప్ ను వెతికి జట్టులోకి తెచ్చేవారు.
ఇలా కొన్ని లక్షల మందిని ఫిల్టర్ చేసుకుని ప్లేయింగ్-11 ను ఎంపిక చేసేవారు. కానీ, భారత్ లో పురుడుపోసుకున్న ఈ ఐపీఎల్ అనే లీగ్ భారత జట్టు ఎంపిక ప్రక్రియను మార్చేసింది. సెలెక్టర్ల పని సగానికి పైనే తగ్గించేసింది. వివిధ ఫ్రాంచైజ్లను కలిగిన ఐపీఎల్, నేరుగా ఫ్రాంచైజ్ వారే సెలెక్టర్లు చేసే పనులన్నీ చేసి, మంచి మంచి ప్రతిభ గల ఆటగాళ్లను తమ జట్టులోకి తెచ్చుకుంటున్నారు.
సెలెక్టర్లు కేవలం ఒక ఆటగాడి ఐపీఎల్ పెర్ఫామెన్స్ చూస్తే సరిపోయేంతగా వారి పని తగ్గింది. ఇలాగే నేడు భారత జట్టులోకి అనేక మంది యువ తేజాలు వస్తున్నారు. వచ్చిన అందరు సక్సెస్ సాధించకపోయినా, వారి కష్టానికి న్యాయం జరుగుతుంది.
ప్రస్తుతం ఐపీఎల్ మనకు ఇచ్చిన ఆణిముత్యాలు అంటే.. అభిషేక్ శర్మ- ఈ యువ సంచలం ఇప్పుడు టీ-20 ఇంటర్నేష్నల్స్ లో అగ్ర బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ఇక టీం ఇండియా లో అగ్రతాంబూలం అందుకుంటున్న హార్దిక్, బుమ్రా, రాహుల్ వంటి బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ ను ఈ లీగే అందించింది.
ఇక తాజాగా నిన్ననే ముగిసిన న్యూజిలాండ్ పై రెండవ టి-20 లో భారత్ గెలుపుకు ఒంటి చేతి మీద పునాది వేసిన ఇషాన్ కిషన్, ప్రస్తుత మన జట్టు కెప్టెన్ సూర్య కుమార్, ఇటీవలే న్యూజిలాండ్ పై ఆడిన వన్-డే సిరీస్ లో తాడో-పేడో తేలాల్సిన సమయంలో వీరోచితమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్న హర్షిత్ రానా వంటి వారందరు ఐపీఎల్ ద్వారా తుది జట్టులో చోటు సంపాదించుకున్న వారే.
నితీష్ రెడ్డి, తిలక్ వర్మ, సిరాజ్ వంటి తెలుగు రాష్ట్రాలకు చెందిన కుర్రాళ్ళు నేడు అంతర్జాతీయ మ్యాచ్ లలో జట్టు ఫైనల్ ప్లేయింగ్-11 లో చోటు దక్కించుకుంటున్నారు అంటే అది కేవలం ఐపీఎల్ చేసిన పుణ్యమే. ఇలాగే, మరెందరో క్రికెటర్లకు ఐపీఎల్ పునాది అవ్వాలని ఆశిద్దాం..!







