వైసీపిలో 65 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం కల్పించబోతున్నారనే వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా హాట్ టాపిక్!
ఒకవేళ అదే జరిగితే వారిలో చాలా మంది మొట్ట మొదట చూసేదీ టిడిపి, జనసేనలవైపే అని వేరే చెప్పక్కరలేదు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు అంత యాక్టివ్గా లేవు కనుక వారికి వేరే ఆప్షన్ లేదు.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకొంటే చురుకుగా పావులు కదపాల్సి ఉంటుంది. బహుశః వైఎస్ షర్మిలతో అటువంటి ప్రయత్నం చేస్తుందేమో?
వైసీపిలో ఈ పరిణామాలను టిడిపి, జనసేనలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. వీలైతే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని సానుకూలంగా మార్చుకోవాలని ఆశపడటం సహజమే. కానీ వైసీపి ఎమ్మెల్యేల కోసం కక్కుర్తి పడితే టిడిపి, జనసేనలు రెండూ మునిగిపోయే ప్రమాదం ఉంటుంది.
ఇప్పటికీ ఆ రెండు పార్టీల మద్య టికెట్ల సర్దుబాట్లు కాలేదు. వాటితో బీజేపీ కూడా చేరితే దానికీ సీట్లు పంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వైసీపి నుంచి వస్తున్నవారిని ఇప్పుడు హడావుడిగా చేర్చేసుకొంటే వారికీ టికెట్లు పంచి ఇవ్వాల్సి ఉంటుంది కదా?
అప్పుడు టిడిపి, జనసేనలు తమ పార్టీలలో ఎవరిని పక్కన పెట్టుకొంటాయి?ఎవరిని వదులుకొంటాయి?అని ఆలోచిస్తే ఇదో పెద్ద సమస్యగా మరే ప్రమాదం ఉందని అర్దమవుతుంది. ఒకవేళ అవి వైసీపి ఎమ్మెల్యేలు, నేతలను చేర్చుకొని, ఇంతకాలం టికెట్ ఆశిస్తూ తమ నియోజకవర్గాలలో పనిచేసుకొంటున్నవారిని పక్కన పెట్టే ఆలోచన చేస్తే, అప్పుడు వైసీపి ఎదుర్కోబోతున్న సమస్యే వాటికీ ఎదురవుతుంది.
కనుక వారిని చేర్చుకోకుండా ఉంటే అప్పుడు వారే వైసీపి భరతం పడతారు. దాని వలన టిడిపి, జనసేనలకు ఎన్నికలలో గెలుపు సులువు అవుతుంది కూడా. కనుక వైసీపి ఎమ్మెల్యేలు, నేతల కోసం టిడిపి, జనసేనలు కక్కుర్తిపడకుండా వారిని దూరంగా ఉంచడమే వాటికి చాలా చాలా మంచిది.




