ఒకప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు, “మా పార్టీలో నం: 2 స్థానం అంటూ ఏమీ లేదు. ఉండదు కూడా. నం: 1 మాత్రమే ఉంది. అది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రమే,” అని చెప్పారు.
అయితే వైసీపీలో ఉన్నప్పుడు ఆయన నం:2గా ఓ వెలుగు వెలుగుతూ, పార్టీలో చక్రం తిప్పేవారనే సంగతి తెలిసిందే.
కానీ జగన్ చుట్టూ కోటరీగా ఏర్పడిన కొందరు, తన గురించి చెడుగా నూరిపోయడంతో తనను పక్కన పెట్టారని, విజయసాయి రెడ్డి గత ఏడాది పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు స్వయంగా చెప్పుకొని బాధ పడ్డారు. అంటే పార్టీలో నం:2 స్థానం కోల్పోయినందుకు బాధపడి తప్పుకున్నారని అర్ధమవుతోంది.
జగన్ కోసం తాను జైలుకి వెళ్ళానని కానీ అయన తన పట్ల అవమానకరంగా వ్యవహరించారని విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకొని ప్రశాంతంగా వ్యవసాయం చేసుకొని జీవిస్తానని చెప్పారు.
కానీ ఏడాది తిరక్కుండానే మళ్ళీ రాజకీయాలలోకి వస్తున్నానని ప్రకటించారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకొని ప్రజల మధ్యకు వస్తాను. ప్రజల గొంతు వినిపిస్తూ వారి పక్షాన్న పోరాడేందుకే ఈ కొత్త పార్టీ. ఈ నెలాఖరులోగానే నా భవిష్య కార్యాచరణ ప్రకటిస్తా,” అని విజయసాయి రెడ్డి చెప్పారు.
విజయసాయి రెడ్డి మళ్ళీ రాజకీయాలలోకి వస్తానని ఇటీవల చెప్పినప్పుడు, జగన్తో చర్చలు సాగుతున్నాయని, సజ్జల రామకృష్ణా రెడ్డితో సహా కొందరిని పక్కన పెడితే మళ్ళీ వైసీపీ చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఊహాగానాలు వినిపించాయి.
కానీ ఇప్పుడు అయన కొత్త పార్టీ అంటున్నారు. కనుక ఆ ఊహాగానాలు తప్పు కావచ్చు లేదా సజ్జలని పక్కన పెట్టేందుకు జగన్ అంగీకరించకపోయి ఉండవచ్చు.
విజయసాయి రెడ్డి పార్టీ పెడితే, ముందుగా వైసీపీ నేతలకే గాలం వేస్తారు. ఎన్నికలలో వైసీపీ ఓట్లే చీలుస్తారు. కానీ షర్మిల వల్ల కాని ఈ పని ఆయన వలన సాధ్యమవుతుందా? కాలమే చెపుతుంది.
అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల ఎంట్రీ ఇచ్చినప్పుడు, అన్న మీద అనేక విమర్శలు చేశారు. విజయసాయి రెడ్డికి జగన్ ఆర్ధిక లావాదేవీలతో సహా అనేక రహస్యాలు తెలుసు.
కనుక ఇప్పుడు అయన వచ్చి నోరు విప్పితే మరిన్ని కొత్త విషయాలు బయటపడవచ్చు. కనుక ఈవిధంగా కూడా జగన్కు కొత్త తలనొప్పులు తప్పవు.
మరోపక్క కూటమి ప్రభుత్వం అమరావతి, పోలవరం, పరిశ్రమలు, డీఎస్సీ, అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలు అంటూ దూసుకుపోతోంది. కనుక వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి నాలుగు వైపులా నుంచి ముట్టడి తప్పదు. సజ్జల శల్యసారధ్యంలో ఒకసారి ఎదురుదెబ్బ తిన్న సింగిల్ సింహం పరిస్థితి ఏమిటో?
Tirumala సాక్షిగా #VijayaSaiReddy కొత్త పార్టీతో Political Re-entry..!
“ప్రజల తరపున.. ప్రజల కోసం.. ప్రజా పక్షంగా”
ఈ నెలలోనే Start..!
–@VSReddy_MP pic.twitter.com/iSulh2ByEN
— M9 NEWS (@M9News_) August 19, 2026




