చమురు నిక్షేపాల కోసం అమెరికా గల్ఫ్ దేశాలు, వెనిజులా వంటి ఇరుగు పొరుగు దేశాలను కబళించడానికి వెనకాడదు. అదే విధంగా చైనా భారత్లో అరుణాచల్ ప్రదేశ్ని, ఫిలిపిన్స్ సమీపంలో దీవులను, తైవాన్ని కబళించేందుకు కుట్రలు చేస్తూనే ఉంటుంది.
చివరికి పాకిస్తాన్ కూడా భారత్ నుంచి కాశ్మీర్ని విడదీసి తమ దేశంలో కలిపేసుకోవాలని నాలుగు దశాబ్దాలుగా చేయని కుట్రలు లేవు.
భారత్ సాయంతో ఏర్పడిన బంగ్లాదేశ్ కూడా భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను కలిపేసుకుంటామని బెదిరిస్తోంది. దానికి చైనా వంతపాడుతోంది.
అయితే భారత్ ఎల్లప్పుడూ ఇరుగుపొరుగు దేశాలకు సాయపడిందే తప్ప ఏనాడూ ఆక్రమించుకోవాలని ప్రయత్నించలేదు.
కరోనా సమయంలో, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారత్ విభేదాలు పక్కన పెట్టి మానవతా దృక్పదంతో మందులు, అత్యవసర సామాగ్రి పంపిస్తుంటుంది.
అయినా ఒక్క భూటాన్ తప్ప భారత్ సహాయసహకారాలు అందుకున్న శ్రీలంక, నేపాల్ వంటి దేశాలు కూడా భారత్ని శత్రువుగా పరిగణిస్తూ చైనాతో చేతులు కలుపుతున్నాయి!
చైనా, పాకిస్తాన్, అమెరికాతో స్నేహమంటే పులి మీద సవారీ వంటిదేనని చెప్పక తప్పదు. పులిపై సవారీ చేస్తున్నప్పుడు భయమే… దిగితే ఇంకా ప్రమాదమే! ఇది తెలిసి ఉన్నా, భారత్ సాయం పొందిన ఇరుగు పొరుగు దేశాలన్నీ చైనా, పాకిస్తాన్లతో ఎందుకు చేతులు కలుపుతున్నాయి?
చివరికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా భారత్ కంటే పాకిస్తాన్కే మొగ్గు చూపుతుంటారు. ఇవన్నీ భారత్ దౌత్య వైఫల్యాలా లేక చైనా, పాకిస్తాన్ దౌత్య విజయమా?







