“పార్టీలు మారడం అనైతికం… ఇలాంటి చర్యలను వెంటనే ఖండించాలి… ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే సిగ్గేస్తోంది… విలువలతో కూడిన రాజకీయాలు లేవు…” ఇవన్నీ ప్రస్తుతం జగన్ చెంత ఉన్న బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు. ‘కొన్ని విమర్శలు చేయడానికి కొందరికి కొన్ని అర్హతలు లేవు’ అన్న నియమ నిబంధనలు రాజకీయాల్లో లేకపోవడం వలన ఇలాంటి సూక్తులను రాష్ట్ర ప్రజానీకం బొత్స నోట నుండి వినాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అవినీతి గురించి జగన్ మాట్లాడుతున్న సందర్భంలో ఎలాంటి నవ్వులు వస్తాయో… బొత్స పార్టీ మార్పు గురించి చేసిన వ్యాఖ్యలు కూడా అలాంటి కామెడీనే పంచుతున్నాయి.
ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్న బొత్స మరి పార్టీ ఎలా మారారు? అంటే బొత్స గారు చేసింది ఎలాంటి రాజకీయం? దీనికి ఏం పేరు పెట్టాలి? బహుశా బొత్స గారు కాంగ్రెస్ లో ఓడిపోయి వైసీపీలో చేరారు.., గెలిచిన వైసీపీ సభ్యులు టిడిపిలో చేరడం పట్ల సత్యనారాయణ విమర్శలు చేస్తున్నారు. ఈ రెండింటిలో తేడా… గెలుపోటములే తప్ప… విధివిధానాలు కాదు అన్న విషయం గమనించాలి. అసలు “పార్టీ మార్పు” అన్నది నైతికత అవునో కాదో కాసేపు పక్కన పెడితే… ఆ స్థాయి విమర్శలు చేయడానికి కాస్తైనా నైతికత ఉండాలి కదా అన్నది అసలు విషయం. మరి ఈ విషయంలో బొత్స అర్హుడో కాదో అన్న విషయం రాజకీయ విజ్ఞులకు తెలిసిందే.
‘అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా…’ అన్నట్లు బొత్స గారి రాజకీయ జీవితం గురించి తెలుగు ప్రజలకు సుపరిచితమే. మరో కామెడీ సంగతి ఏమిటంటే… ఇటీవల కాలంలో బిజెపి అధినాయకత్వంతో బొత్స సత్యనారాయణ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఉన్నట్లుండి ఈ ప్రణాళిక కార్యరూపం సిద్దించకపోయినా, ‘కమలం’ జెండా బొత్స గారు పట్టుకోవడం ఖాయమన్న ప్రచారం జరిగింది. ఈ వార్తలను బొత్స గారు ఖండించలేదు కూడా..! ఒకవేళ మళ్ళీ పార్టీ మారితే… పార్టీలు మారడమే నైతికత అంటారో ఏమో..! చెప్పలేం… ప్రజా జీవితాలతో ఆడుకునే ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఎవరూ ఊహించలేరు మరి..!





