ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థ మీద పోరాటం మొదలుపెట్టారు. చంద్రబాబు ప్రోద్బలంతో కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ డైరెక్షన్ లో తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపిస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి… ఆ తరువాత ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు.
ఇది న్యాయవ్యవస్థ మీద దాడి అంటూ ఒక వర్గం అంటుంటే… మరోవర్గం న్యాయవ్యవస్థ ప్రక్షాళనకు నడుం కట్టిన ధీరుడు అంటూ జగన్ ని కీర్తిస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఇప్పటివరకూ ఎన్వీ రమణ మీద ప్రధాన న్యాయమూర్తి ఎటువంటి యాక్షన్ తీసుకునే ఉద్దేశం ఉన్నట్టుగా కనబడటం లేదు.
ఇది ఇలా ఉండగా… ఈ వివాదం కారణంగా మాజీ న్యాయమూర్తులకు డిమాండ్ పెరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూల మీడియా జగన్ వాదన కు మద్దతు ఇచ్చే వారి వ్యాసాలు ప్రకటిస్తుంటే వ్యతిరేక మీడియా మాత్రం అది తప్పనే వారి వెంట పడుతుంది. దానితో ఇప్పటివరకూ జనాలకు గుర్తు లేని… అసలు తెలియని మాజీ న్యాయమూర్తులకు డిమాండ్ పెరిగింది.
మరోవైపు…. ఫిర్యాదు చేసి ఇప్పటికే రెండు వారాలు కావొస్తున్నా దాని మీద కదలిక లేకపోవడంతో ఏపీలోని అధికారపార్టీలో తీవ్ర ఆగ్రహం ఉన్నట్టు సమాచారం. ఇదే విషయంపై ఫాలో అప్ చెయ్యడానికి జగన్ ఈ వారం ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగినా ఇప్పుడు ఆ ప్రయత్నం విరమించుకున్నట్టు సమాచారం.




