ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 14న తిరుపతిలో ఒక బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఏమైందో ఏమో కరోనా కేసులు పెరుగుతున్నాయి కనుక ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తన సభను రద్దు చేసుకుంటున్నా అంటూ ముఖ్యమంత్రి తిరుపతి లోక్ సభ నియోజకవర్గం ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు.
గతంలో ఎన్నడూ జగన్ కు గానీ ఆ పార్టీ వారికి గానీ కరోనా స్పృహ అనేదే లేదు. సడన్ గా ఇదేంటబ్బా అని అంతా అనుకున్నారు. సర్లే ఇప్పటికైనా మార్పు వచ్చిందేమోలే అని ఆశపడ్డారు కూడా. అయితే అదంతా వట్టిమాట షరామామూలే అని జగన్ మరోసారి నిరూపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బాగా పనిచేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లను సత్కారమంటూ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకిలో ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్రం నలుమూలల నుండీ వచ్చిన వలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను జగన్ ప్రదానం చేశారు. తిరుపతిలో ఉన్న కరోనా పోరంకిలో లేదా అంటూ పెదవి విరిచేలా సభ నిర్వహించారు. అక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి కనీసం మాస్కు కూడా పెట్టుకోకుండా చిద్విలాసం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.
జగన్ అంతే చెప్తాడంతే… చెయ్యడు ఇంతే అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అసలు తిరుపతిలో తన ప్రచారం ఎందుకు రద్దు చేసుకున్నారు అనే చర్చ మళ్ళీ మొదలయ్యింది. రాజకీయ విశ్లేషణలు, కారణాలు ఎలా ఉన్నా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాల్సిన ముఖ్యమంత్రి పదే పదే కరోనా గైడ్ లైన్స్ ను ఉల్లంఘిస్తూ ప్రజల మీద మాత్రం మాస్కులు పెట్టుకోలేదు అంటూ ఫైన్లు వెయ్యడం దారుణం.





