అభివృద్ధి అంటే ఇది కదా?

Nellore Mega Furniture Cluster Project

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వరుస దెబ్బలు తిన్న రాష్ట్రం ఇంత త్వరగా కోలుకుంటుందని ఎవరూ ఊహించలేదు కూడా. కానీ సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తరలివస్తున్నాయి.

గతంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తేనే రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయని వితండవాదం చేస్తూ ఏమీ చేయకుండానే 5 ఏళ్ళు గడిపేసింది.

ADVERTISEMENT

కానీ యావత్ దేశానికి ఢిల్లీ రాజధానిగా ఉన్నా ఏవిధంగా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయో అదేవిధంగా చిత్తశుద్ధి ఉంటే ఏపీకి ఒక్క అమరావతి రాజధాని ఉన్నా రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి చేయవచ్చని కూటమి ప్రభుత్వం నిరూపించి చూపుతోంది. దీనికి తాజా నిదర్శనంగా సిఎం చంద్రబాబు నాయుడు నిన్న గూడూరులో చేసిన ప్రకటన గురించి చెప్పుకోవచ్చు.

నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని చిల్లకూరు మండలంలో దేశంలోనే అతిపెద్ద మెగా ఫర్నిచర్ క్లస్టర్ ఏర్పాటవుతోంది. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రూ.3,500 కోట్ల పెట్టుబడితో వెయ్యి ఎకరాలలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నాయి. వరల్డ్ ఫర్నిచర్ కాన్ఫెడరెషన్ సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని డిజైన్ చేస్తున్నారు.

ఈ పార్క్ కృష్ణపట్నం ఓడరేవుకు, జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేస్తునందున దేశవిదేశాల నుంచి ముడిసరుకు దిగుమతికి, ఇక్కడ తయారైన ఫర్నీచర్ ఎగుమతులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ఇక్కడ దాదాపు 450-500 చిన్న, మద్య తరహ, భారీ పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ ప్రాజెక్టులో వుడ్ ప్రాసెసింగ్, ఫర్నీచర్ డిజైనింగ్, తయారీ, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ రంగాలలో కనీసం పది వేల మందికి పైగా యువతకు నేరుగా ఉద్యోగాలు లభిస్తాయి. స్థానిక వ్యాపారులు కూడా వీటి ద్వారా లబ్ది పొందుతారు.

ఈ పార్కులో అత్యాధునిక సాంకేతికతతో రకరకాల ఫర్నిచర్‌ను తయారు చేస్తారు. ఐటీ, కార్పొరేట్ కంపెనీల కోసం మోడ్యులర్ వర్క్‌స్టేషన్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, ఇళ్ళకు అవసరమైన ఫర్నీచర్ ఇక్కడ తయారు చేస్తారు. మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ప్రధానంగా రీసైకిల్డ్ కలపతో ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు.

ఈ ప్రాజక్టులో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తోంది. ‘ప్లగ్ అండ్ ప్లే’ మౌలిక వసతులతో కూడిన ప్లాట్లను కేటాయిస్తారు. పరిశ్రమల స్థాపన జరిగిన మొదటి కొన్ని సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలపై సబ్సిడీ ఉంటుంది. అలాగే భూమి రిజిస్ట్రేషన్ మరియు లీజు డాక్యుమెంట్లపై వంద శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద వచ్చే స్టేట్ జీఎస్టీ పై నిర్దిష్ట కాలపరిమితి వరకు రీఇంబర్స్మెంట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.

ఈ మెగా ఫర్నిచర్ పార్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశంలోనే ఫర్నిచర్ తయారీకి నెల్లూరు జిల్లా ప్రధాన కేంద్రంగా అవతరిస్తుంది. ఇది కదా అభివృద్ధి అంటే?

ADVERTISEMENT
Latest Stories