వైసీపీ అధినేత పరామర్శ యాత్ర అంటే బలప్రదర్శన యాత్రలేనని పదేపదే నిరూపించుకుంటున్నారు. నేడు కర్నూలు జైలులో ఉన్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వచ్చినప్పుడు ఇదే జరిగింది.
ప్రతీసారి పోలీసులు ఆంక్షలు విధించడం, వాటిని జగన్ ఉల్లంఘించడం పరిపాటిగా మారిపోయింది. ఇది ఏ రకమైన రాజకీయమో వైసీపీయే చెప్పాలి.
ఓ పక్క టీడీపి మంత్రులు ‘దమ్ముంటే శాసనసభ సమావేశాలకు రావాలని’ జగన్కు పదేపదే సవాలు విసురుతున్నారు. అయితే శాసనసభకు వచ్చేందుకు ఓ మాజీ ముఖ్యమంత్రికి దమ్ముండాలా?అంటే అవుననే అనిపిస్తుంది.. రాకపోవడానికి అయన చెపుతున్న కుంటి సాకు వింటున్నప్పుడు.
సిఎం చంద్రబాబు నాయుడుని, అయన ప్రభుత్వాన్ని రోజూ విమర్శించే జగన్, శాసనసభ సమావేశాలకు హాజరయ్యి ఆయనను ఎదుర్కొనేందుకు ఎందుకు భయపడుతున్నారు?
ఆయన అంటే అంత భయమున్నప్పుడు, మళ్ళీ రోడ్లపై ఈ బలప్రదర్శనలతో ఆయనని భయపెట్టగలనని ఎలా అనుకుంటున్నారు? అనేవీ సమాధానం దొరకని సందేహాలు.
గతంలో టీడీపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పలువురు టీడీపి నేతలు కూడా నిరసన ర్యాలీలు నిర్వహించారు. వారు కూడా నాడు పోలీస్ ఆంక్షలు ఉల్లంఘింఛి పాదయాత్రలు చేశారు.
కానీ వాటికీ వీటికీ తేడా ఏమిటంటే, వాటిలో బలంగా నిరసనలు మాత్రమే తెలిపెవారు. కానీ జగన్ ర్యాలీలలో ‘రప్పా రప్పాలు’ ‘రాసిపెట్టుకోండి’ వంటి హెచ్చరికలతో కూడిన ఫ్లెక్సీలు కనిపిస్తాయి.
వైసీపీ శ్రేణులు డీజేలు పెట్టుకొని రోడ్లపై బైక్ స్టంట్స్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా పరామర్శయాత్రలో భాగమే అనుకోమంటారు.
అడ్డుకుంటే రాజకీయ వేధింపులంటారు మళ్ళీ అదే నోటితో ‘తమ ప్రజాదరణ చూసి సిఎం చంద్రబాబు నాయుడు భయంతో గజగజా వణికిపోతున్నారని’ కూడా చెప్పుకుంటారు.
జగన్ బలప్రదర్శనలను ‘పోటెత్తిన ప్రజాభిమానం’గా వైసీపీ చెప్పుకుంటోంది. కనుక టీడీపి కూడా వీటిని ‘డీకోడ్’ చేసి వాటి పరమార్ధం ప్రజలకు చెప్పడం చాలా అవసరమే. లేకుంటే ‘పోటెత్తిన ప్రజాభిమానమే’ ఫిక్స్ అయిపోతుంది.



