రాంగోపాల్ వర్మ సినిమా టైటిల్స్ ప్రభావం వైసీపి మీద బాగానే పడిన్నట్లుంది. ‘మా నమ్మకం’, ‘మా భవిష్యత్’ స్లోగన్స్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఫోటోతో ‘సిద్దం’ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.
వీటి కోసం జగన్ ప్రభుత్వం ఏ పద్దులో నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందో తెలీదు కానీ మళ్ళీ మరో కొత్త స్లోగన్, కొత్త పోస్టర్స్తో సిద్దం అయ్యింది.
ఈసారి స్లోగన్ ఏమిటంటే ‘నాకు ఓ కల ఉంది… అంటూ రైతుల కల నా కల, కార్మికుల కల నా కల, విద్యార్దుల కల నా కల అంటూ ఆయా వర్గాల ప్రజలతో జగన్ ఫోటోలతో కూడిన పోస్టర్స్ నేడో రేపో విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
మొదట ప్రజలందరినీ ‘మా నమ్మకం నువ్వే జగన్’ అని అనుకోమన్నారు. కానీ ఇప్పుడు ప్రజల కలలని తన కలలుగా చెప్పుకొంటున్నారు!
నిజానికి ప్రజల కలలు లేదా ఆకాంక్షలు అర్దం చేసుకోలేకపోవడం వలననే ఇన్ని పోస్టర్స్ వేసుకొని పబ్లిసిటీ చేసుకోవలసి వస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీని సమస్యల నుంచి గట్టెకించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడుని కాదని ప్రజలు ‘మాకు ఒక్క ఛాన్స్ ఎందుకు ఇచ్చారు?’ అని ఆలోచిస్తే జగన్ ప్రభుత్వం పాలన వేరే విదంగా సాగి ఉండేది. కానీ ‘మరో ఛాన్స్ పొందాలంటే ఏమి చేయాలి?’ అనే ఆలోచించారు. కానీ మరో ఛాన్స్ కోసం రాష్ట్రాభివృద్ధికి బదులు సంక్షేమ పధకాలని ఎంచుకుని అప్పుల పాలు చేశారు. ప్రతిపక్షాలని రాజకీయంగా దెబ్బ తీసి అడ్డుతొలగించుకోవాలని అనుకున్నారు.
మూడు రాజధానుల వంటి చిత్రవిచిత్రమైన ఆలోచనలని రాష్ట్రంపై, ప్రజలపై బలవంతంగా రుద్దుతూ, నా అభిప్రాయమే మీ అభిప్రాయంగా భావించి అంగీకరించాలనేవారు.
కానీ ఇప్పుడు దిగిపోయే సమయం దగ్గర పడుతున్నప్పుడు, ప్రజల కలలు, ఆకాంక్షలే నా కలలు, ఆకాంక్షలని చెపుతూ ఆ ఫ్లెక్సీ బ్యానర్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఐదేళ్ళు ఆడిందే ఆటగా పాలన సాగించిన జగన్ ప్రభుత్వానికి సామాన్య ప్రజల కలలు గురించి అసలు తెలుసా?
రైతుల కల: పంటలకు సాగునీరు, గిట్టుబాటు ధరలు.
రాజధాని రైతుల కార్యకర్తలు: అమరావతి నిర్మాణం.
విద్యార్దుల కల: ఫీజ్ రీఇంబర్స్మెంట్ బాకీ పెట్టకుండా చెల్లిస్తే చాలు.
మధ్యతరగతి ప్రజల కల: పన్నులు, ఛార్జీలు, చెత్తపన్ను బాదుడు నుంచి విముక్తి.
నిరుద్యోగుల కల: జాబ్ క్యాలండర్, రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాటిలో ఉద్యోగాలు సంపాదించుకోవడం. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కల: నెలనెలా సకాలంలో జీతాలు, సిపిఎస్ రద్దు.




