ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకామూడేళ్ళు సమయం ఉంది. కానీ రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య జోరుగా సాగుతున్న రాజకీయాలు అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం అమరావతి, పోలవరం భోగాపురం, పరిశ్రమలు వంటి అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలను మెప్పించేందుకు గట్టిగా కృషి చేస్తుంటే, ఢిల్లీలో జరిగిన సీజేపీ ఆందోళనలతో సహా ప్రతీ అంశాన్ని అందిపుచ్చుకుంటూ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా రెండు పక్షాల మధ్య భీకర యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి.
రాష్ట్రంలో ఇంత వాడి వేడిగా రాజకీయాలు జరుగుతున్నందున, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి కాలు బయటపెట్టడం లేదనే విమర్శలు అర్ధరహితంగా మారినట్లనిపిస్తుంది.
ఆయన విమర్శలు, చేపట్టే ప్రతి కార్యక్రమాలపై కూటమి ప్రభుత్వం అంతే ధీటుగా స్పందించాల్సి వస్తోంది. లేదంటే వైసీపీ రాజకీయంగా పైచేయి సాధిస్తుందనే భావన ప్రజలకు కలిగితే, కూటమి పార్టీలకు కనపడని నష్టం జరుగుతుంది.
అయితే జగన్ రాజకీయ వ్యూహాల్లో పదేపదే చేస్తున్న కొన్ని తప్పులే కూటమి ప్రభుత్వానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు.
జగన్ పరామర్శ యాత్రలు, జైలు పరామర్శ యాత్రలను కూడా బలప్రదర్శనగా మార్చడం, ఆ సందర్భాలలో మాట్లాడుతున్న మాటలు టీడీపికి ఎదురుదాడి చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీంతో ఉవ్వెత్తున ఎగసిన వైసీపీ, ప్రతీసారి అంతే వేగంగా కింద పడుతున్నట్లవుతోంది.
కానీ కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు మొదలుపెట్టినా లేదా పూర్తి చేసినా వాటి క్రెడిట్ మాదేనంటూ వైసీపీ చేస్తున్న వితండవాదం, సిఎం చంద్రబాబు నాయుడుకి, టీడీపి శ్రేణులకు కూడా తీవ్ర అసహనం కలిగిస్తూనే ఉన్నాయి. ఈవిధంగా కూడా అధికారపార్టీని ఇబ్బంది పెట్టవచ్చని వైసీపీ నిరూపిస్తోంది.
కనుక దానికి కౌంటర్ ఇచ్చేందుకు టీడీపి తప్పనిసరిగా ప్రతి విమర్శలు చేయాల్సివస్తోంది. వైసీపీ కూడా ఇదే కోరుకుంటోంది.
అధికార పార్టీ ఎదురుదాడి చేస్తుంటే, ఈ రాజకీయ సిగపట్లు ఇలా కొనసాగుతూనే ఉంటాయి. అప్పుడు అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది తప్ప తాడేపల్లి ప్యాలస్ నుంచి జగన్ బయటకు రావడం లేదనే విమర్శలు వినిపించవు.
ముఖ్యంగా ఇరు పార్టీల మధ్య ఈ స్థాయిలో భీకర రాజకీయయుద్ధాలు కొనసాగుతున్నాయంటే అర్థం… వైసీపీ రాజకీయంగా చాలా చురుకుగా, బలంగా ఉందనే సందేశం ప్రజలకు పంపించగలుగుతోంది. టీడీపికి వైసీపీ సమఉజ్జీ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇదీ ఒకరకమైన రాజకీయ వ్యూహమే కనుక ఈ రాజకీయ చదరంగంలో ఎవరు ఎవరికి చెక్ మేట్ చెప్తారనేది కీలకం.




