తొలి విడతలో పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేల తర్వాత ఢిల్లీలో మాట్లాడిన జగన్… “ప్రలోభాలకు లొంగి వెళ్ళిన నలుగురు ఎమ్మెల్యేలను తీసివేస్తే, మిగిలి ఉన్న ఎమ్మెల్యేలందరికీ ‘హ్యాట్సాఫ్’ చెప్పారు. అయితే ఆ హ్యాట్సాఫ్ చెప్పిన మిగిలిన ఎమ్మెల్యేలలో మరొకరు తగ్గారు. అయితే పార్టీ మారే వారి సంఖ్య చాలానే ఉన్నందున, ముందుగానే ‘హ్యాట్సాఫ్’ చెప్పి జగన్ తొందర పడ్డారేమోనన్న విశ్లేషణలు వస్తున్నాయి. కానీ, ఎంతమంది టిడిపిలోకి వచ్చినా లేక ఇతర పార్టీలకు మారినా, మిగిలిన ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా ‘హ్యాట్సాఫ్’ చెప్పాల్సిందే అంటున్నారు పరిశీలకులు.
జగన్ అనుసరిస్తున్న రాజకీయ విధానాలకు మరియు ముఖ్యంగా జగన్ వ్యవహార తీరుపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో జగన్ తో పాటు కొనసాగడమంటే సాధారణ విషయం కాదన్నది ఈ కధనం సారాంశం. ఓ పక్కన మూడు నాలుగేళ్ళుగా వరుసగా విఫలమవుతున్న రాజకీయ వైఫల్యాలకు తోడు పరిపక్వత లేని జగన్ ఊకదంపుడు ప్రసంగాలు పార్టీని మరింతగా కృంగదీస్తున్నాయి. అనుభవ రాహిత్యం అనే కంటే కూడా ఆధిపత్యం కోసం పరితపించే అసందర్భ వ్యాఖ్యలుగానే జగన్ ఉపన్యాసాలు ఉండడంతో పార్టీ ఎదుగుదల మాట అటుంచితే, తిరోగమన దిశగా పయనిస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇలాంటి పరిణామాలను బేరీజు వేసుకున్న నాయకులు తమ అభిప్రాయాలను పార్టీ అధినేతకు వివరిద్దామా అనుకుంటే… ఒంటెద్దు పోకడ నిర్ణయాలే తప్ప, పార్టీలో చర్చలకు ఆస్కారం ఉండదనే మాటలు ఆరంభం నుండి వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ‘అటు కక్కలేక, ఇటు మింగలేక’ అన్న చందంగా వైసీపీ నాయకుల పరిస్థితి ఉందని గత ఏడాది కాలంగా రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారంలో ఉన్న విషయమే.
ఇలాంటి అనుభవాలన్నీ భరిస్తూ… జగన్ తో ప్రయాణించడమంటే సాధారణ విషయం కాదు కదా! అందుకే ఎప్పటికైనా జగన్ తో ఉన్న నేతలకు “హ్యాట్సాఫ్” వర్తిస్తుంది… ఈ విషయాలన్నీ జగన్ కు కూడా తెలుసు కాబట్టే… తన పోకడను తట్టుకుని నిలబడిన నాయకులందరికీ నాడు చెప్పిన “హ్యాట్సాఫ్” ఎప్పటికీ వర్తిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.





