జగన్ పరామర్శ యాత్రలను బల ప్రదర్శన యాత్రలుగా మార్చి ప్రభుత్వానికి, పోలీసులకు సవాలు విసురుతూనే ఉన్నారు.
క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయ్యి నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు గురువారం నెల్లూరుకు బయలుదేరబోతున్నారు. తాడేపల్లి ప్యాలస్ నుంచి హెలికాఫ్టర్లో నెల్లూరు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు జైలుకి వెళతారు.
పొదిలి, పల్నాడు పర్యటనలలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని నెల్లూరు పోలీసులు జగన్ పర్యటనపై పలు ఆంక్షలు విధించారు.
హెలికాఫ్టర్ వద్దకు కేవలం 10 మందిని మాత్రమే అనుమతిస్తామని, హెలిప్యాడ్ నుంచి జైలు వరకు ఎటువంటి ఊరేగింపులు, రోడ్ షో, బైక్ ర్యాలీ, రెచ్చగొట్టే ఫ్లెక్సీల ప్రదర్శనలకు అనుమతి లేదని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. ఎవరైనా రెచ్చగొట్టే నినాదాలు చేసినా, దాడులకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జగన్ నెల్లూరులో దిగినప్పటి నుంచి తిరిగి వెళ్ళే వరకు డ్రోన్ కెమెరాలతో నిఘా పెడతామని చెప్పారు. జగన్కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నందున తన భద్రతకు భంగం కలుగకుండా ఉండేందుకు ఆయన కూడా పోలీసులకు సహకరించాలని ఎస్పీ దామోదర్ విజ్ఞప్తి చేశారు.
కానీ జగన్ పర్యటనకు పరామర్శ అనేది ఓ సాకు మాత్రమే కనుక ఇప్పటికే నెల్లూరు వైసీపీ నేతలు భారీగా వైసీపీ కార్యకర్తలని సమీకరించి బల ప్రదర్శనకు సిద్దం చేస్తున్నారు. కనుక రేపటి జగన్ పర్యటన కూడా ఉద్రిక్తంగా సాగబోతోందని ముందే స్పష్టమవుతోంది.
అయితే నిరంతరం ప్రజల మద్య ఉంటూ ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాల్సిన జగన్, ఈవిదంగా కొత్త రకం రాజకీయాలు ఎందుకు చేస్తున్నారనే సందేహం కలుగక మానదు.
తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కనుక శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదని జగన్ ఏవిదంగా కుంటి సాకు చెపుతూ తప్పించుకున్తున్నారో, అదేవిదంగా తనకు ప్రాణహాని ఉందని, అయినా ప్రభుత్వం తనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించడం లేదని పదేపదే ఆరోపిస్తూ తాడేపల్లి ప్యాలస్లోనే కాలక్షేపం చేస్తున్నారు.
కానీ ప్యాలస్లో కాలక్షేపం చేస్తుంటే, పార్టీ శ్రేణులు నిరుత్సాహపడతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోయి చెల్లా చెదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. కనుక అప్పుడప్పుడు ఈవిదంగా పరామర్శ యాత్రల పేరుతో బలప్రదర్శనలు చేస్తూ, ‘రప్పా రప్పా..’ అంటూ ప్రభుత్వానికి సవాలు విసురుతూ, పోలీసులను బెదిరిస్తూ పార్టీ శ్రేణులలో ఆత్మస్థయిర్యం పెంచి ఉత్సాహం నింపవచ్చని జగన్ ఈ కొత్త రకం రాజకీయాలు చేస్తున్నట్లు భావించవచ్చు.
తద్వారా జగన్ తన పూర్తి సమయం ప్రత్యక్ష రాజకీయాలలో ఉండాల్సిన అవసరం ఉండదు. కానీ పార్టీని విజయవంతంగా నడిపించవచ్చని ఇప్పటికే స్పష్టమైంది. బహుశః రాబోయే రోజుల్లో మిగిలిన పార్టీల నేతలు కూడా ఇదే విధంగా రాజకీయాలు చేసినా ఆశ్చర్యం లేదు.




