ఎన్నికలకు ముందు ఎవరో కొందరు గోదావరి జిల్లాలలో ‘పవనన్న కు ప్రాణమిస్తాం… జగనన్నకు ఓటు వేస్తాం’ అంటూ ఒక ఫ్లెక్స్ పెట్టారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తరువాత చాలా చోట్ల ఆ ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చాయి. అయితే ఆ ప్రచారం ప్రభావం చూపిందో లేకమరొకటో తెలీదుగానీ నిజంగా పవన్ అభిమానుల ఓట్లు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ కే పడ్డాయి.
‘పవనన్న కు ప్రాణమిస్తాం… జగనన్నకు ఓటు వేస్తాం’ అన్న దానిని పట్టుకుని చాలా మంది నిజమైన జనసైనికులను ఎద్దేవా చేస్తూ ఉంటారు టీడీపీ వారు. పవన్ నాయకత్వం మీద జనసేన పార్టీ మీద నమ్మకం లేకపోవడం వల్లే సొంత అభిమానులు కూడా పక్క చూపులు చూశారని దానికి అర్ధం.
అయితే ఎన్నికల ఓటమి తరువాత తన అభిమానులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ కు ఓటు వేశారనే మాట పవన్ తరచు ప్రస్తావిస్తున్నారు. తాజాగా తన సభలకు లక్షలాది మంది జనం వచ్చినా.. తనపై అభిమానం ఉండి కూడా వైసీపీకి ఓటేశారన్నారు పవన్. ఉపాధి కోసమే వైసీపీని గెలిపించారన్నారు.
అయితే ఆ మాట తరచు అనవద్దని అది తమను ఎంతగానో బాధపెడుతుందని జనసైనికులు సోషల్ మీడియాలో అంటున్నారు. అటువంటి మాటల వల్ల ప్రజల్లోకి నెగటివ్ ప్రచారం వెళ్తుందని వారు అంటున్నారు. తిరుపతి ఉపఎన్నిక, స్థానిక ఎన్నికల నేపథ్యంలో అది అంత మంచిది కాదని వారి అభిప్రాయం.





