పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నేత ఎస్విఎస్ఎన్ వర్మ ఈసారి కూడా పిఠాపురం నుంచి శాసనసభకు పోటీ చేయాలనుకున్నారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు దక్కడంతో ఆయన తీవ్ర అసంతృప్తి చెందిన మాట వాస్తవం.
అప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ 5 ఏళ్ళుగా వైసీపి నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్ళు, వేధింపులు భరిస్తూనే మేమందరం నియోజకవర్గంలో టిడిపిని కాపాడుకున్నాము. కానీ ఇప్పుడు ఈ సీటుని జనసేనకు కేటాయించడం మా అందరి కష్టం వృదా అయిన్నట్లు భావిస్తున్నాము.
కానీ దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎటువంటి సంబందమూ లేదని భావిస్తున్నాము. ఇది పొత్తులలో భాగంగా మా పార్టీ తీసుకున్న నిర్ణయం కనుక మా అభిప్రాయాలను మా అధినేత చంద్రబాబు నాయుడుతో చెపుతాము. టిడిపి అవలీలగా గెలుచుకోగల ఈ సీటుని జనసేనకు ఇచ్చేయవద్దని కోరుతాము,” అని అన్నారు.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆయనతో స్వయంగా మాట్లాడి పరిస్థితి వివరించి బుజ్జగించడంతో వర్మ మెత్తబడ్డారు. కానీ ఆయనలో ఇంకా పిఠాపురంపై ఆశలు మిగిలే ఉన్నాయని తాజా స్టేట్మెంట్ స్పష్టం చేస్తోంది.
పిఠాపురంలో మీడియాతో మాట్లాడుతూ, “పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకు ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు నాయుడు చెప్పారు. కనుక ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పూర్తి సహాయసహకారాలు అందించవలసిందిగా కోరారు.
మా అధినేత ఆదేశం, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను, నా అనుచరులు పవన్ కళ్యాణ్ని గెలిపించుకునేందుకు గట్టిగా కృషి చేస్తాం. ఆయన గెలుపు మా గెలుపుగానే భావిస్తాము. ఒకవేళ ఆయన మనసుమార్చుకొని ఎంపీగా పోటీ చేయాలనుకుంటే మాత్రం పిఠాపురం నుంచి తప్పకుండా నేనే పోటీ చేస్తాను. జనసేన అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ కాకుండా మరెవరిని పిఠాపురం నుంచి పోటీ చేయించాలనుకున్నా వారిని మా భుజాలపై పెట్టుకొని మోయాల్సిన అవసరం లేదు. మోయము కూడా,” అని వర్మ స్పష్టం చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ ఎంపీ సీటుకి పోటీ చేసే ఉద్దేశ్యం లేదని, పిఠాపురం నుంచే శాసనసభకు పోటీ చేయబోతున్నానని తేల్చి చెప్పేశారు కనుక ఈసారికి వర్మకు అవకాశం తప్పిపోయిన్నట్లే. కనుక పార్టీ మారే ఆలోచన చేయకుండా, మాట తప్పకుండా పవన్ కళ్యాణ్ గెలుపుకి సహకరిస్తారనే ఆశిద్దాం.




