కేసులో ఓడినవాడు కోర్టు వద్దే ఏడిస్తే, గెలిచినవాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడన్నట్లు, జగన్-షర్మిల మద్య యుద్ధాలు కొనసాగితే వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆమె ఏపీ కాంగ్రెస్ని గెలిపించుకోలేకపోయినా, జగన్ ఓటమికి ఉడతా భక్తిగా తోడ్పడ్డారనేది వాస్తవం.
కనుక అన్నని ఓడించినందుకు ఆమె బయట సంతోషపడితే, ఓడిపోయినందుకు జగన్ ప్యాలస్లో ఒంటరిగా కూర్చొని బాధపడే ఉంటారు.
కానీ ముందే చెప్పుకున్నట్లు ఈ యుద్ధంలో ఇద్దరూ గెలవలేదు. ఇద్దరూ ఓడిపోయారు. వారి ఉమ్మడి శత్రువు గెలిచారు.
ఈ విషయం కాస్త ఆలస్యంగా అర్దమవడంతో ప్రస్తుతం విజయమ్మ, మరికొందరు శ్రేయోభిలాషులు వారిద్దరికీ మధ్యవర్తిత్వం చేసి రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.
షర్మిలని మళ్ళీ వైసీపీలోకి రప్పిస్తే, ఒకవేళ మద్యం కుంభకోణం కేసులో జగన్ లోపలకు వెళ్ళాల్సి వచ్చినా, ఇదివరకులా మళ్ళీ ఆమె పార్టీని కాపాడుకుంటుందనేది ఒక పాయింట్ అని టాక్.
తల్లీ కూతుర్లు మళ్ళీ వైసీపీలో యాక్టివ్ అయితే వైసీపీలో కోటరీ మారుతుంది. పార్టీ బాగుపడుతుంది. కనుక ఆమెను పార్టీలోకి రప్పించేందుకు ఆస్తులలో వాటాలు, రాజకీయ హామీలపై మధ్యవర్తులు చర్చలు జరుపుతున్నట్లు టాక్.
ఈ విషయం పసిగట్టే విజయసాయి రెడ్డి కొత్తపార్టీతో రంగంలో దిగుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అంటే షర్మిల వైసీపీలో చేరిపోతే ఆమెకు బదులు విజయసాయి రెడ్డి గేమ్ కంటిన్యూ చేస్తారన్న మాట!
ఈ రాజీ టాక్కు మరో బలమైన కారణం కూడా వినిపిస్తోంది. ఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల మద్య బంధాలు బలంగా ఉండటం ఆయనకు, టీడీపికి ప్లస్ పాయింట్ అని, దానిని వారు బాగా ప్రాజెక్టు చేసుకుంటూ, తెలివిగా ఉపయోగించుకుంటూ ప్రజల మనసులు గెలుచుకుంటున్నారని వైసీపీ మేధావులు గుర్తించి, జగన్కు ఈ ప్రతిపాదన చెప్పినట్లు తెలుస్తోంది.
సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోంది. కూటమిలో పార్టీల ఐఖ్యత కూడా బాగానే ఉంది. పైగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది. కనుక వచ్చే ఎన్నికలలో సింగిల్ సింహం మళ్ళీ ఎంత గర్జించినా ప్రయోజనం ఉండదు.
కనుక మళ్ళీ తల్లిని, చెల్లిని తెచ్చుకోవడమే బెటర్ అని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు టాక్. షర్మిలకు కూడా కాంగ్రెస్ పార్టీతో ఒరిగిందేమీ లేదు. మరో పదేళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉపయోగం ఉండదు. కనుక ఆమె కూడా ఆస్తులు, పదవులు పంచాయితీ తేలిపోతే అన్నతో రాజీకి సిద్దపడినట్లు టాక్.
ఈ టాక్ నిజమో కాదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అంతవరకు షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు … జగన్ వైసీపీ అధ్యక్షుడు అంతే!





