మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఎన్నికల తరువాత జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తూ.. సినిమాల్లో ఇక నటించబోనని చెప్పిన పవన్ మాటమార్చారని లక్ష్మీనారాయణ ఆరోపించారు. మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్ తీసుకున్ననిర్ణయం ఆయన లోని నిలకడ లేని విధి విధానాలను సూచిస్తుందని లక్ష్మీనారాయణ లేఖలో విమర్శించారు.
అయితే లక్ష్మీనారాయణ తరువాతి అడుగు ఎటు ఉంటుందని అంతా చర్చించుకున్న సమయంలో ఆయన రాజకీయాల్లో స్తబ్దుగా ఉండిపోయారు. లక్ష్మీనారాయణ చాలా రోజుల తరువాత ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది కావొస్తుంది. ఇప్పటివరకూ… తమ మేనిఫెస్టో లో చేసిన వాగ్దానాలు నెరవేర్చే ప్రయత్నమైతే చేస్తున్నారు. సాధారణంగా చాలా మంది ఎన్నికలు గెలిచాకా పట్టించుకోరు. అయితే జగన్ అలా కాదు. జగన్ తో నాకు ఎటువంటి విబేధాలు లేవు. నా బాధ్యత నేను నిర్వర్తించాను,” అంటూ చెప్పుకొచ్చారు.
దీనితో జేడీ వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అనే చర్చ అందరిలోనూ ఉంది. అయితే ఈ విషయంలో జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి. జగన్ పదహారేళ్లు జైలు జీవితం గడపడానికి జేడీ కారణమని ఆ పార్టీలో చాలా మంది ఆరోపించే వారు. జగన్ కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయన పార్టీలోకి వస్తా అంటే ఏమంటారో! అయితే రాజకీయాలలో ఏదైనా సాధ్యమే.





