తెరాస పార్టీ పేరు మార్పుతో అనుకోని ఎదురుదెబ్బలు తింటున్నారు కేసీఆర్. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఆశతో తెరాస ని బిఆర్ఎస్ గా పేరు మార్చిన కేసీఆర్ కు ప్రాంతీయంగా తెలంగాణలో ఉన్న పట్టును కోల్పోయారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు అన్ని అపశకునాలే ఎదురయ్యాయి. మేడి గడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన పిల్లర్ కుంగిపోవడం, అలాగే కుమార్తె కవిత పై ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదురవ్వడం, పార్టీ నుండి ఒక్కక్కొరు కారు దిగి హస్తం గూటికి చేరుకోవడం ఇలా ఎటు చూసిన బిఆర్ఎస్ కు ఎదురుగాలే విసింది.
దీనికి తోడు సర్వేలు కూడా కేసీఆర్ ఓటమిని ముందుగానే నిర్దారించడంతో ఇక ఓటమి ముందు తలవంచక తప్పలేదు కేసీఆర్. ఒకపక్క ఓటమి బాధ కేసీఆర్ ను వెంటాడుతున్న తరుణంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు పార్టీకి మరో మోయలేని భారంగా తయారయ్యింది. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని పార్టీలోని సీనియర్లు అంతా పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.
తెరాస అధికారంలో ఉన్న పదేళ్లు అధికారాన్ని ఎంజాయ్ చేసి ప్రతిపక్షం మీద ఆరోపణలు చేసి సుఖంగా తమ రాజకీయ జీవితం నెట్టుకెళ్తున్న బిఆర్ఎస్ పార్టీలో సీనియర్లు అంతా అధికారం దూరమవ్వగానే పార్టీ అధినేత మీద నిందలు వేస్తూ పార్టీ పరువుని బజారుకు లాగుతున్నారు. కవిత, కేటీఆర్ మీద వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ తరుపున ఎన్నికల బరిలోకి వెళ్లే ఆలోచన లేదంటూ పార్టీ కండువా మార్చిన కడియం శ్రీహరి, అతని కుమార్తె హస్తం తీర్థం పుచ్చుకున్నారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ఇక ప్రతిపక్ష పార్టీ మీద విమర్శలు ఎక్కు పెట్టాల్సిన సమయం ఆసన్నం అయ్యిందని ఇక పని మొదలుపెట్టారు కడియం. బిఆర్ఎస్ పార్టీలో తమను కూలీలుగా చూసారని, ఆ పార్టీలో ఏనాడూ తమ నిర్ణయానికి గౌరవం ఇవ్వలేదని, పార్టీలో మేము కూడా భాగస్వాములం అన్న భావన ఎన్నడూ కలగలేదని, మేం ఏంచెప్పినా మీకు ఏమి తెలియదు అంటూ చులకన భావనతో చూసేవారని, అందుకే పార్టీలో ఉండలేక బయటకు వచ్చేసాం అంటూ సెలవిచ్చారు కడియం శ్రీహరి.
అయితే ఈ విమర్శలన్నీ కూడా బిఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడు చేసినవే కావడంతో ఆ విమర్శలలో బలమెంతో ఆ నేతకు విలువెంతో ప్రజలే తేల్చాలి. అధికారం ఉన్నన్నాళ్లు అధికారాన్ని అనుభవించి ప్రతిపక్షంలోకి రాగానే విమర్శలు చేసి అధికార పార్టీ వైపు ఆకర్షితులు కావడం వర్తమాన రాజకీయాలలో పరిపాటిగా మారిపోయింది. అయితే గతంలో కేసీఆర్ కూడా ఇదే తరహా విమర్శలు చేసి వచ్చిన నాయకులను తన కారెక్కించుకోవడంతో కేసీఆర్ ఇటువంటి నేతల మీద విమర్శలు చేసే నైతిక హక్కును కోల్పోయారు.




