కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఈసారి ఉగాది పండుగ తిహార్ జైల్లో జరుపుకోవలసి రావడం ఆమె తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు చాలా బాధ కలిగించవచ్చు. జ్యూడిషియల్ రిమాండ్ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్నప్పుడు పోలీసుల మద్యన ఆమె ఫోటోలు, వీడియోలు మీడియాలో రావడం కూడా చాలా బాధాకరమే.
ఆమెకు మహిళా న్యాయామూర్తి కావేరీ బవేజా మధ్యంతర బెయిల్ తిరస్కరించడం బాధాకరం. తెలంగాణలో కల్వకుంట్ల కవిత మాట్లాడితే వినేందుకు మీడియా, బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, జనం అందరూ ఎదురుచూస్తారు. కానీ ఈరోజు కోర్టులో కల్వకుంట్ల కవిత నేరుగా న్యాయమూర్తితో మాట్లాడాలనుకుంటే అనుమతించలేదు. ఆమె కోర్టు హాలులో ఏమైనా చెప్పాలనుకుంటే న్యాయవాది ద్వారానే చెప్పాలని, ఒకవేళ స్వయంగా చెప్పాలనుకుంటే దరఖాస్తు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించడం ఆమెకు మరో షాక్!
మధ్యంతర బెయిల్ తిరస్కరించడం కంటే, ఎందుకు తిరిస్తున్నామో తెలియజేస్తూ న్యాయమూర్తి కావేరీ బవేజా 21 పేజీల తీర్పులో చెప్పిన కారణాలు ఆమెకు, ఆమె తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు, బిఆర్ఎస్ నేతలకు ఇంకా పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.
కల్వకుంట్ల కవిత దేశ, విదేశాలలో ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతురాలు. భారత్ జాగృతి సంస్థకి అధ్యక్షురాలుగా మహిళలను చైతన్యపరిచారు. గతంలో ఆమె ఎంపీగా పార్లమెంటులో పలు స్టాండింగ్ కమిటీలలలో పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. కనుక ఆమె అబల లేదా అమాయకురాలు అని అనుకోలేము. కనుక ఈ మద్యం కేసులో ఎవరో ఆమెను ఇరికించారని లేదా ఆమె అమాయకంగా ఇరుక్కున్నారని అనుకోలేము.
ఈ కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు ఈడీ బలమైన సాక్ష్యాధారాలు సమర్పించింది. ఆమె విచారణకు సహకరించడం లేదని తేలింది. ఈ కేసులో కీలకమైన ఆధారాలుగా భావిస్తున్న ఆమె మొబైల్ ఫోన్లను ఈడీకి స్వాధీనం చేసేటప్పుడు దానిలో డేటాని ఆమె తొలగించిన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది.
ఇంతకాలం ఆమె బయట ఉన్నప్పుడూ ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేశారని ఈడీ సాక్ష్యాధారాలు చూపింది. కనుక కల్వకుంట్ల కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని న్యాయమూర్తి చెప్పారు.
ఇక ఆమె కుమారుడు పరీక్షల కోసం బెయిల్ కోరడం కూడా సరికాదని భావిస్తున్నాము. ఎందుకంటే, ఆమె పెద్ద కుమారుడు తల్లితండ్రులకు దూరంగా స్పెయిన్లో చదువుకొంటున్నప్పుడు, తండ్రి, కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మద్య సొంతింట్లో ఉన్న రెండో కుమారుడు పరీక్షలకు ఆమె సహాయం అవసరమని మేము భావించడం లేదు. ఇప్పటికే 50% పరీక్షలు ముగిసిపోయాయి కదా? కనుక ఈ కారణంతో ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఆమె న్యాయవాదుల అభ్యర్ధన మేరకు ఆమె రెగ్యులర్ బెయిల్ విచారణను నాలుగురు రోజులు ముందుగా ఈనెల 16 చేపట్టేందుకు న్యాయమూర్తి అంగీకరించారు.
అయితే మధ్యంతర బెయిల్ విషయంలోనే న్యాయమూర్తి ఈ కేసులో కల్వకుంట్ల కవిత నేరం చేసిన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు, రెగ్యులర్ బెయిల్ విషయంలో ఆమె తన అభిప్రాయాన్ని మార్చేసుకుంటారని అనుకోలేము. కనుక ఆమెకు రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ లభించకపోవచ్చు.
ఈ పరిస్థితులలో ఆమె సుప్రీంకోర్టులో ప్రయత్నించుకోవలసి రావచ్చు. ఈలోగా ఢిల్లీ పెద్దలతో కేసీఆర్ రాజీ ప్రయత్నాలు ఫలిస్తే కల్వకుంట్ల కవిత కడిగిన ముత్యంలా కాకపోయినా “ఇటువంటి బెదిరింపులకు ఈ తెలంగాణ బిడ్డ బెదిరిపోదు. న్యాయం, ధర్మం గెలిచాయి. జై తెలంగాణ… జై కేసీఆర్,” అని నినాదాలు చేస్తూ బయటకు రాగలుగుతారు. లేకుంటే లోక్సభ ఎన్నికలు ముగిసేవరకు తిహార్ జైల్లోనే ఉండాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు.




