తెలంగాణలో పట్టుమని పది సీట్లు సాధించలేని బీజేపీ పార్టీ 2028 లో జరిగే ఎన్నికలలో ఏకంగా అధికారంలోకి వస్తుందని, అప్పుడు తెలంగాణకు నేనే సీఎం అంటూ తనకుతానే ప్రకటించేసుకున్నారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించిన కాన్ఫిడెన్స్ లో ఉన్న ఈ బీజేపీ నేత ‘రాబోయే కాలానికి కాబోయే సీఎం నేనే’…ఇది నా ఛాలెంజ్ అంటూ ప్రకటించుకోవడం చూస్తుంటే ఆయనకు ఉన్నది ఉత్సహమా.. అత్యుత్సహమా..? అంటూ సొంత పార్టీ నేతలు సైతం చెవులు కొరుక్కుంటున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికి గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీకి బలమైన నాయకత్వం కానీ క్యాడర్ కానీ లేదు. ఒక్కో ఎన్నికలకు ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుని అలా ఎన్నికలను నెట్టికెళ్తున్న బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఎదో ఒక అద్భుతం జరగాలి తప్ప సాధారణ పరిస్థితులలో అది సాధ్యమయ్యే పని కాదు.
ఒక వేళ ఆ అద్భుతమే జరిగి బీజేపీ అధికారంలోకి వచ్చినా కేవీ రమణా రెడ్డి నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటిస్తుంది అనుకోవడం ఆయన అత్యాశే అవుతుంది. ఇలా ఊహాలోకంలో కాకుండా వాస్తవిక ప్రపంచంలోకి వచ్చి ఆలోచిస్తే కనీసం త్వరలో తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో గతం కంటే ఎక్కువ స్థానాలు సాధించి పార్టీని బలపరిస్తే ఎదో ఒక ఒక రోజు కేవీ రెడ్డి కన్న ముఖ్యమంత్రి కల కాకపోయినా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అనే కల అయినా నెరవేరే అవకాశం ఉంటుంది.




