తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమితో నేరాశ్యంలోకి వెళ్లిపోయిన కేసీఆర్ అటు ప్రజలకు ఇటు సొంత పార్టీ నేతలకు, అసెంబ్లీ కి దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీ బాధ్యతను, బరువును భుజానేసుకుని అధికార పార్టీ నేతలతో మాటల యుద్ధం చేస్తున్నారు కేటీఆర్. అయితే త్వరలో తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించాల్సిన బాధ్యత పార్టీ అధినేత కేసీఆర్ పైనే ఉండడంతో ఇక పార్టీ నేతలతో చర్చలు, సమావేశాలు మొదలు పెట్టారు కేసీఆర్.
ఈరోజు కేసీఆర్ తో జరిగిన సమీక్షా సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, ఆరూరి రమేష్ వంటి ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఆరూరి రమేష్ బీజేపీ లో చేరనున్నారనే వార్తలు ఖండిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ తో వరంగల్ పార్లమెంట్ సీటు పై జరిగే చర్చలో పాల్గొన్నారు. ఈ భేటీ తరువాత బిఆర్ఎస్ నుండి పోటీ చేయబోయే రెండు పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల పేర్లు ఖరారు చేసారు కేసీఆర్.
చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వరరావు, వరంగల్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పేర్లను ప్రకటించారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగులకే ప్రాధాన్యత నిచ్చి ఎవరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఒంటెద్దు పోకడలను అనుసరించిన కేసీఆర్ ను ఒకే ఒక్క ఓటమి మార్చేసిందా అన్నట్టుగా ఇప్పుడు పార్టీ నాయకుల అభిప్రాయాలను తెలుసుకుంటూ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ఈ నెల 16 న తన పార్టీ నుండి పోటీ చేయబోయే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడానికి నిర్ణయించుకుంది. అలాగే టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా టీడీపీ నుంచి 94 , జనసేన నుంచి 6 మొత్తం 100 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసారు.
పొత్తులో భాగంగా జనసేన తీసుకున్న 24 ఎమ్మెల్యే సీట్లకు గాను మూడు బీజేపీ కి త్యాగం చేసి 21 కి చేరింది. ఇందులో ఇప్పటికే తెనాలి, అనకాపల్లి, నెల్లిమర్ల, రాజానగరం, కాకినాడ రూరల్, నిడదవోలు స్థానాలలో అభ్యర్థులను ప్రకటించిన పవన్ రేపు మిగిలిన 15 స్థానాలలో కూడా తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అంటూ వార్తలు వినపడుతున్నాయి.
పవన్ ఎంత త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తే అంత మంచిది అంటూ జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే ముందుగా ఉన్న 24 , 21 గా మారిపోయినట్లు ఈ 21 నుంచి ఇంకెంత తగ్గిపోతుందో అని ఆందోళన చెందుతున్నారు ఆ పార్టీ క్యాడర్. ఇలా అభ్యర్థులను ఫైనల్ చేసి ఎన్నికల ప్రచారంలోకి దూకుడుగా అడుగుపెట్టడానికి పార్టీల అధినేతలు చర్చలు, సమావేశాలు ,సమీక్షలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.




