టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ చాణక్యానికి పదును పెడుతున్నారు. శత్రుశేషం మిగల్చకుండా చూసుకోవాలనే లక్ష్యంలో భాగంగా గులాబీ దళపతి వేస్తున్న ఎత్తులకు మీడియా కూడా అతీతం కాదనే విషయం తెలిసిందే. వ్యతిరేక వార్తలు రాస్తే పాతాళంలో పాతిపెడతానని కేసీఆర్ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. కొద్దికాలం క్రితం ఆ మీడియా సంస్థ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తన సంకెళ్లను తెంచుకున్నప్పటికీ కేసీఆర్ వేసిన స్కెచ్కు మరో మీడియా సంస్థ చిక్కుల్లో పడింది.
కేసీఆర్ కుట్రపూరిత ఎత్తులకు ప్రతిపక్షాలు ఆశ్చర్యపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన కన్ను ఎప్పటి నుంచో మీడియా సంస్థల మీద ఉండగా… తాజాగా దాని ఫలితం కనిపించింది. నమస్తే తెలంగాణ దినపత్రికను ముందుగా కేసీఆర్ తన సన్నిహితులతో ప్రారంభింపచేశారు. అయితే దాన్ని నడపలేక చేతులెత్తేయడంతో కష్టకాలంలో తెలంగాణ వాణిని వినిపించేందుకు తెలంగాణకు చెందిన బడా కాంట్రాక్టర్ సీఎల్ రాజం ఆ పత్రిక వాటాలు తీసుకొని విజయవంతంగా నడిపించారు. అదే సమయంలో మెట్రో ఇండియా పేరుతో మరో ఇంగ్లిష్ పత్రికను రాజం సొంతంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ రాజంను ఆకాశానికి ఎత్తారు. తెలంగాణకు రాజం లాంటి వారి అవసరం ఉందని… ప్రజా గొంతుకను పత్రిక ద్వారా వినిపించిన రాజంను రాజ్యసభ మెంబర్గా ఎంపిక చేస్తానని సభా వేదికగా హామీ ఇచ్చారు.
ఆ విధంగా ఎంపీ పదవితో రాజంను ఖుష్ చేశారు. అయితే తెలంగాణ ఏర్పడటం, కేసీఆర్ సీఎం అయిన నేపథ్యంలో కేసీఆర్ తన బుద్ధి చాటుకున్నారు. తన వాటాలు వెనక్కు తీసుకునేలా స్వయంగా కేసీఆర్ రాయభారం నడపటం, రాజంపై ఒత్తిడి తేవటంతో వాటాల మార్పిడి అయిష్టంగా అయినా పూర్తయ్యింది!! అయితే ఇంగ్లిష్ పత్రికగా మెట్రో ఇండియా పెద్దగా పనితీరు కనబర్చకపోయినా రాజం తెలంగాణ ఏర్పడిన ఏడాదిన్నర పాటు ఎలాగోలా నడిపించారు. తాజాగా ఆర్థిక కష్టాలు పెరిగిపోయి పత్రికను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా ఉద్యోగులు రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడింది.
అయితే ఈ పరిస్థితికి పరోక్ష కారణం కేసీఆర్ అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ తన వాటాలు తాను ఉంచుకుంటే రాజం తెలుగుతో సమాంతరంగా మెట్రో ఇండియాను నడిపించుకునేవారని చెప్తున్నారు. ఆయనకు ఇచ్చిన ఎంపీ పదవి హామీ మాట దేవుడు ఎరుగు… సొంత వాటాలు కూడా లాక్కోవడమే కాకుండా… ఏకంగా పేపర్ మూపించే పరిస్థితికి తీసుకువచ్చారంటే కేసీఆర్ తనకు అండగా నిలిచిన వారికి సైతం వెన్నుపోటు ఏ విధంగా పొడవగలరో తేలిపోతుందని చెప్తున్నారు.





