
పదవి, అధికారం ఉంటే అందం, ఆరోగ్యం కూడా వస్తుందా?లేకపోతే పోతుందా?అంటే ఖచ్చితంగా ‘అవును.. కాదు’ అని సమాధానం చెప్పలేము. కానీ మాజీ సిఎం కేసీఆర్ ప్రస్తుత పరిస్థితి చూస్తున్నప్పుడు పదవి, అధికారం- అందం, ఆరోగ్యానికి ఏదో సంబంధం ఉందనే అనిపిస్తుంది.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎంత యాక్టివ్గా ఉండేవారో అందరూ చూశారు. ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి ఫామ్హౌస్లోనే ఉంటున్నారు. కనుక పూర్తి విశ్రాంతి, సమయానికి ఆహారం, నిద్ర అన్నీ కుదురుతున్నాయి కనుక కేసీఆర్ మరింత ఆరోగ్యంగా మారి ఉండాలి. కానీ కేవలం ఈ ఏడాదిన్నరలోనే కేసీఆర్ని వృద్ధాప్యం ముంచుకువచ్చేసినట్లు కనబడుతున్నారు.
Also Read – వైసీపీ హయాంలో ‘స్మశానం’, ఇప్పుడు ‘సువర్ణం’?
ఏప్రిల్ 27న హనుమకొండలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం చాలా చప్పగా సాగింది… అని కూతురు కల్వకుంట్ల కవిత లేఖలో చెప్పేశారు కూడా.
అనర్గళంగా ప్రసంగించే కేసీఆర్, ఈసారి కాగితం మీద వ్రాసుకొచ్చిన పాయింట్స్ చూసుకొని ప్రసంగించారు. ‘ఇకపై రోజూ కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధమే’ అని చెప్పిన కేసీఆర్ ఆ సభ తర్వాత ఒక్కసారి కూడా పార్టీ కార్యాలయానికి రాలేదు.
Also Read – కవిత అవమాన భారం…బిఆర్ఎస్ మౌనరాగం..?
ఈరోజు హైదరాబాద్ ఏఐజీ హాస్పిటలలో సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఫామ్హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నా కేసీఆర్ ఈవిదంగా మారిపోవడం చూస్తే, ఇకపై ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనగలరా లేదా?అని అనుమానం కలుగక మానదు.
పైగా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులు మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. అందుకే బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసేద్దామనుకున్నారా? అందుకే కేటీఆర్కి పార్టీకి పగ్గాలు అప్పగించాలనుకున్నారా?అంటే కల్వకుంట్ల కవిత విమర్శలు వింటే అవుననే అనిపిస్తుంది.
Also Read – ఒకరు సస్పెండ్.. మరొకరు సస్పెన్స్.. అయినా తీరు మారలే!
కానీ ఓ పక్క పార్టీలో పదవులు, పగ్గాలు, ప్రాధాన్యత కోసం కీచులాడుకుంటున్న కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవితలు.. ‘కేసీఆరే మా నాయకుడు… ఆయనే కాబోయే ముఖ్యమంత్రి’ అని చెప్పుకుంటున్నారు. అవునో కాదో ఆయనే బయటకు వచ్చి చెపితే ప్రజలు, ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలా సంతోషిస్తారు కదా?