మూడు రాజధానులు-అధికార వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో జేయేసీ మీటింగ్, చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా డ్రామా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్సే అని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మూడున్నరేళ్ళుగా పాలిస్తున్న జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కాలక్షేపం చేస్తూ మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి అవుతుందని వాదిస్తుండటం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. కనీసం రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేకపోయిందని, ఇక మూడు రాజధానులు ఏం నిర్మిస్తుందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
జగన్ ప్రభుత్వం తన వైఫల్యాలని కప్పి పుచ్చుకొని, ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఇప్పుడు ఈ రాజీనామా డ్రామాలతో డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ హయాంలోనే మండల వ్యవస్థతో అధికార వికేంద్రీకరణ జరిగిందని అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడూ, ఆ తర్వాత అమరావతి రాజధానిగా ఉన్నప్పుడూ కూడా రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి చూపారని అన్నారు.
స్వర్గీయ కింజారపు ఎర్రంన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకి అనేక పరిశ్రమలు తీసుకువచ్చారని, చంద్రబాబు నాయుడు విశాఖకు అనేక ఐటి కంపెనీలు తీసుకువచ్చారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. కనుక జగన్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన, చిత్తశుద్ధి ఉండి ఉంటే మూడు రాజధానులంటూ మూడున్నరేళ్ళు కాలక్షేపం చేసి ఉండేవారే కారని అన్నారు. ఈ మూడున్నరేళ్ళలో మంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన బందువులకి విశాఖలో కోట్లు విలువచేసే దసపల్లా భూములు కట్టబెట్టారని ఆరోపించారు. విశాఖలో తనకు ఓ ఫ్లాట్ తప్ప మరేవీ ఆస్తులులేవన్న విజయసాయి రెడ్డికి మూడున్నరేళ్ళలో ఇన్ని వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైసీపీ నేతలు మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంద్ర జిల్లాలో సుమారు 40 వేల ఎకరాలు కొట్టేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాత్రికి రాత్రి భూముల డాక్యుమెంట్లు మారిపోతుండటం చూసి విశాఖ ప్రజలు హడలిపోతున్నారని అన్నారు.
మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, దానికే ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారని సిఎం జగన్మోహన్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నట్లయితే, తక్షణం ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలే అమరావతి కావాలో మూడు రాజధానులు కావాలో తేల్చి చెపుతారని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. కరణం ధర్మశ్రీ వంటి నేతలను ముందు పెట్టుకొని జగన్ రాజీనామా డ్రామాలు ఆడటంకంటే ధైర్యంగా తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వచ్చి టిడిపిని ఎదుర్కోవాలని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.



