
నిన్న అమరావతిలో జరిగిన ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రికి చంద్రబాబు సవాలు విసిరారు. “ప్రజలు 3 రాజధాని లకు మద్దతు అని చెపితే నేను రాజకీయలనుండి తప్పుకుంటా..రాష్ట్రం అంతా నాతోనే వుందంటున్నావు గా రెఫరెండంకి వెళదామా?,” అంటు చంద్రబాబు సవాలు విసరగా ముఖ్యమంత్రి స్పందించలేదు.
అయితే దాని మీద స్పందిస్తున్న మంత్రులు కూడా ఆ విషయంగా డొంకతిరుగుడిగా స్పందించడం గమనార్హం. తాము జనరల్ ఎలక్షన్స్లో గెలిచి వచ్చామని, బై ఎలక్షన్స్లో కాదన్నారు మంత్రి కొడాలి నాని. రాజీనామాలు చేసి పుట్టిన పార్టీ వైసీపీ అని మంత్రి కొడాలి నాని అన్నారు.
కావాలంటే అమరావతి రెఫరెండంగా టీడీపీ 18 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. రాజీనామాలు అంటే తమకు భయం లేదని కొడాలి నాని చెప్పుకొచ్చారు. పోనీ చంద్రబాబు విసిరిన సవాలు ఇష్టం లేకపోతే కనీసం గతంలో జగన్ సవాలు చేసినట్టుగా ఎంపీలతో రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్ళవచ్చు.
మీ ఎంపీలతో రాజీనామా చెయ్యండి మా వారితో కూడా చేయిస్తాం అంటూ జగన్ పదే పదే చంద్రబాబు మీద సవాలు విసిరేవారు. చంద్రబాబు సవాలు స్వీకరించినట్టు అవుతుంది… అలాగే ప్రత్యేక హోదా కోసం గతంలో చెప్పినట్టుగా పోరాడినట్టు అవుతుంది. కనీసం ఆ రకంగానైనా ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తారా?





