లొట్టిపిట్ట కేసుకి లక్ష పూచీకత్తు… ఎందుకు?

KTR appears in Formula E case at ACB Court

కేసీఆర్‌ హయంలో మున్సిపల్ శాఖా మంత్రిగా చేసిన కేటీఆర్‌ చొరవ తీసుకొని హైదరాబాద్‌లో ఎఫ్‌-1 రేసింగ్ ఈవెంట్ నిర్వహింపజేశారు. దాంతో హైదరాబాద్‌ పేరు దేశంలో మారుమ్రోగిపోయిన మాట నిజం.

మళ్ళీ బీఆర్ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే మళ్ళీ నిర్వహించి ఉండేవారు కూడా. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో అదే కేటీఆర్‌ మెడకు చుట్టుకుంది. దాని కోసం నిబంధనలకు వ్యతిరేకంగా విదేశీ కంపెనీకి సుమారు రూ.55 కోట్లు చెల్లించారని, దానికి ప్రతిఫలంగా బీఆర్ఎస్‌ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో లబ్ది పొందిందని కేసు నమోదైంది.

ADVERTISEMENT

అప్పటి నుంచి కేటీఆర్‌ ‘ఇదొక లొట్టిపిట్ట కేసు’ అంటూ ఎద్దేవా చేస్తూనే ఉన్నారు. అదే లొట్టిపిట్ట కేసులో నేడు ఆయనతో సహా ఐదుగురు నిందితులు నాంపల్లి ఏసీబీ కోర్టుకి హాజరయ్యారు. ఈ కేసు విచారణ ఆగస్ట్ 25కి వాయిదా పడింది. కానీ కేటీఆర్‌తో సహా నిందితులు ఒక్కొక్కరూ లక్ష రూపాయల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తులతో ష్యూరిటీ సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. కనుక చెల్లించి బయట పడ్డారు.

సాధారణంగా జైల్లో రిమాండ్ మీద ఉన్నవారికి బెయిల్‌ మంజూరు చేసేటప్పుడు న్యాయస్థానాలు ఈవిధంగా పూచీకత్తు, ష్యూరిటీలు కోరుతుంటాయి. ఈ కేసులో కేటీఆర్‌ని అరెస్ట్ చేయలేదు. కానీ పూచీకత్తు, ష్యూరిటీ సమర్పించాల్సి వచ్చిందంటే దాదాపు ఆ పరిస్థితి నెలకొని ఉందని స్పష్టమవుతోంది. ఒకవేళ వాటిని సమర్పించేందుకు కేటీఆర్‌ నిరాకరిస్తే ఏమవుతుంది? అని ఆలోచిస్తే పరిస్థితి అర్ధమవుతుంది.

ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్‌ని ఈ కేసులో విచారించి ఛార్జ్ షీట్‌ దాఖలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్ వద్ద అనుమతి తీసుకొని చాలా కాలమే అయ్యింది. కనుక ఈ కేసులో కేటీఆర్‌ జైలుకి వెళ్ళక తప్పదని సిఎం రేవంత్ రెడ్డి ఇదివరకే చెప్పారు. అందుకు నేను కూడా సిద్దమేనని కేటీఆర్‌ జవాబిచ్చారు. కనుక కేటీఆర్‌ చెప్పుకుంటున్నట్లు ఇదేమీ లొట్టిపిట్ట కేసు కాదని పూచీకత్తు, ష్యూరిటీలతో స్పష్టమవుతోంది.

కానీ ఇలాంటి కేసులతో ఫుట్ బాల్ ఆడుకోవడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. కనుక ఈ కేసు విచారణ ఎన్నేళ్ళు సాగుతుందో, ఏవిదంగా ముగుస్తుందో ఎవరికీ తెలీదు.

ADVERTISEMENT
Latest Stories