ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వైసీపి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అంటూ దాదాపు ఏడాదిన్నరగా జాతీయ మీడియా సంస్థలు సైతం నమ్మకంగా చెప్పేవి. వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి నేటికీ 175/25 మనవే అని చెప్పుకొంటున్నారు కూడా. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసినా జనాలు మనల్నే గెలిపిస్తారని అధినేత భ్రమలో ఉంటే ఉండొచ్చు గాక కానీ లోకం కాదు!
అందుకే ఇదివరకు జగన్ భజన చేసిన జాతీయ మీడియా కూడా ఇప్పుడు ఏపీలో టిడిపి, జనసేన, బీజేపీల గెలుపు తధ్యం అంటూ వాస్తవాన్ని కళ్ళ ముందు ఉంచుతున్నాయి.
ఇటీవలే ఏబీపీ-సీ ఓటర్, న్యూస్ 18 మీడియా సంస్థలు సర్వే చేసి టిడిపి, జనసేన, బీజేపీ కూటమికి 17-18, వైసీపికి 4-5 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని చెప్పాయి.
తాజాగా ఇండియా టీవీ-సిఎన్ఎక్స్ సంస్థలు కలిసి సర్వే చేసి లోక్సభ ఎన్నికలలో ఏపీలో టిడిపి 14, జనసేన-1, బీజేపీ-2, వైసీపి-8 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తమ అంచనాలు తెలియజేశాయి.
గత ఎన్నికలలో వైసీపి ఏకంగా 23 ఎంపీ సీట్లు గెలుచుకొని రికార్డు సృష్టించింది. కానీ ఈసారి వాటిలో 15 సీట్లు కోల్పోయి కేవలం 8 మాత్రమే దక్కించుకోబోతోందని సర్వేలు చెపుతున్నాయి. కానీ వైసీపి ఆ మాత్రం సీట్లు గెలుచుకున్నా చాలా గొప్ప విషయమే అవుతుంది.
ఎందువల్ల అంటే, ఇంతవరకు టిడిపి, జనసేనలు మాత్రమే ఉంటే ఇప్పుడు బీజేపీ కూడా వాటితో చేరింది. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాబోతోందని అన్ని సర్వేలు చెపుతున్నాయి. కనుక వైసీపికి ఓట్లు వేసి వృధా చేసుకోవడం కంటే, కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేనలకు ఓట్లు వేయడమే మంచిదని ప్రజలు భావించడం సహజం.
ఎన్నికలకు ఇంకా సుమారు రెండు నెలల సమయం ఉంది. ఆలోగా టిడిపి, జనసేన, బీజేపీలు మరిన్ని సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకోవడం తధ్యం. కనుక వైసీపికి ఈసారి లోక్సభ ఎన్నికలలో 5-6 ఎంపీ సీట్లకు మించి రాకపోవచ్చు.




