ఒంగోలు వైసీపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీపై తిరుగుబాటు ప్రకటించేశారు. నిన్న తన పుట్టినరోజు వేడుకలని బలప్రదర్శన చేశారు. అప్పుడే ఈసారి ఒంగోలు శాసనసభకు నేను, లోక్సభ స్థానానికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయబోతున్నాము,” అని ప్రకటించేశారు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇదివరకు రెండు మూడుసార్లు పార్టీపై అలిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనను తాడేపల్లికి పిలిపించుకొని బుజ్జగించి పంపించేవారు. ఆయన కోరుకొన్న పనులు చేయించేవారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో బాలినేని ‘తాను మంత్రిగా పనిచేసినప్పుడు లంచాలు తీసుకొన్నానని, తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ కాసానని, జగన్పై తమకు అభిమానం ఉంది కానీ ఆయనకే తమపై లేదంటూ’ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపి ప్రభుత్వంలో సిఎం స్థాయి నుంచి క్రింద వరకు అందరూ అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా బాలినేని లంచాలు తీసుకొన్నాని చెప్పడం వాటి ఆరోపణలను ధృవీకరించిన్నట్లే అయ్యింది. తమ ప్రతిపక్షాలకు ఆయుధం అందించిన్నట్లయింది. అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆయనను తాడేపల్లికి పిలిపించకుండా ఫోన్లోనే గట్టిగా క్లాసు పీకిన్నట్లు సమాచారం.
బహుశః వైసీపిలో తన వికెట్ పడిపోతోందని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే పుట్టినరోజు వేడుకల పేరుతో బలప్రదర్శన చేసి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు అభ్యర్ధులుగా తమ పేర్లను ప్రకటించేసుకొన్నారని భావించవచ్చు.
ఇప్పటికే ఆయన తీరు పట్ల తీవ్ర అసహనంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ క్షణంలోనైనా బాలినేనిని మెడ పట్టుకొని బయటకు గెంటేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆయనతో చేతులు కలిపినందుకు లేదా ఈసారి లోక్సభ టికెట్ వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చేందుకు మాగుంటపై కూడా వేటు వేయడం ఖాయమే.
కనుక ఒంగోలు వైసీపిలో మరో రెండు వికెట్లు పడబోతున్నాయి. అవి రోజుల్లో పడతాయా లేక గంటల్లోనేనా? అనేది మాత్రమే తెలియవలసి ఉంది.




