రాజకీయ పార్టీలకు సొంత మీడియా కూడా ఉంటే అది అగ్నికి వాయువు తోడైన్నట్లే. సొంత అభిప్రాలు, ఆలోచనలు, దురాలోచనలు, మనసులో కోరికలు అన్నిటినీ ప్రజల అభిప్రాయంగా ప్రచారం చేసుకోవచ్చు. చేసిందేమీ లేకపోయినా నిరభ్యంతరంగా సొంత డప్పు కొట్టుకోవచ్చు.
పార్టీ చేతికి మట్టి అంటకుండా మీడియాని మీడియాతోనే ఎదుర్కొంటూ ఎదుటవాడిపై కావలసినప్పుడల్లా కావలసినంత బురద జల్లవచ్చు. ఓడిపోతున్నా గెలుస్తున్నామని ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలను తారుమారు చేయవచ్చు. ఇలా ఒకటేమిటి… సొంత మీడియాతో అనేక లాభాలు ఉన్నాయి.
ఇందుకు తాజా ఉదాహరణగా వైసీపి సొంత మీడియా సాక్షి నేటి ఆన్లైన్లో సంచికలో “బాబుతో చాలా డేంజర్… సేనానీ… నీ ప్రాణాలకు ఉంది హాని,” అనే శీర్షికతో ప్రచురించిన కధనం గురించి చెప్పుకోవచ్చు.
పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకుంటే ఆయన రాష్ట్రంలో కాపు ఓట్లన్నీ తెచ్చి టిడిపికి అప్పగిస్తారనుకుంటే, పిఠాపురంలోనే ఎదురీదుతున్నారని దానిలో పేర్కొంది. కనుక చంద్రబాబు నాయుడు చేసిన చేతబడులు, బాణామతి, ఎత్తులు, జిత్తులూ కుట్రలన్నీ విఫలం అవడంతో ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్కు హాని తలపెట్టే అవకాశం ఉందని జనసైనికుల పేరుతో సాక్షి చెపుతోంది!
పవన్ కళ్యాణ్పై జరుగుతున్న బ్లేడ్ బ్యాచ్ దాడులు చంద్రబాబు నాయుడే చేయించి ఉండవచ్చన్నట్లు సాక్షి పేర్కొంది. ఈ ఎన్నికలలో గెలిచేందుకు చంద్రబాబు నాయుడు దేనికైనా వెనకాడరని, కనుక పవన్ కళ్యాణ్ తగు జాగ్రత్తలో ఉండటం మంచిదని హెచ్చరిస్తూనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసే కిరాయి మనుషులతో ఈ బ్లేడ్ బ్యాచ్ దాడుల డ్రామా ఆడుతూ, వైసీపిపై బురద జల్లుతున్నారని పేర్కొనడం గమనార్హం.
కుట్రలు చేయడంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఇద్దరే అని వారు ఎన్నికలలో గెలిచేందుకు ఇటువంటి కుట్రలు చేస్తూ తమ సొంత మీడియాలో ఇదంతా జగన్ ప్రభుత్వమే చేయిస్తోందని దుష్ప్రచారం చేసుకుంటున్నారని సాక్షి కధనంలో పేర్కొంది.
అంటే ఏవిదంగా కుట్రలు చేయాలో చెపుతూనే అవన్నీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లే చేస్తున్నారని చెపుతోందన్న మాట! కనుక ‘ఇక్కడ అన్ని రకాల కుట్రలు నేర్పబడును’ బోర్డు పెట్టుకోవడం ఒక్కటే తక్కువ.




