ముద్రగడ, ప్రవీణ్ కుమార్‌… ఓమ్ భీమ్ బుస్..!

Mudragada Padmanabham Jagan RS Praveen KCR

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కులాల పేరు చెప్పుకొని నాయకులుగా ఎదిగినవారు చాలా మందే ఉన్నారు. అయితే వారి వలన వారి కులాలలో నిరుపేదలకు ఏం మేలు జరిగిందో తెలీదు కానీ వారు మాత్రం కులం పేరుతో రాజకీయాలలో రాణిస్తున్నారు. అటువంటి వారిలో ఏపీలో ముద్రగడ పద్మనాభం, తెలంగాణలో దళిత నాయకుడుగా ఆవిర్భవించిన ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్‌ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన సందర్భం ఏర్పడింది.

ADVERTISEMENT

ముందుగా ముద్రగడ పద్మనాభం గురించి చెప్పుకుంటే నిన్న ఆయన మెడలో వైసీపి కండువా పడిన తర్వాత వెయ్యి ఏనుగుల బలం వచ్చిన్నట్లు చాలా మాట్లాడారు.

కిర్లంపూడిలో తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ, “నేను రాజకీయాలలోకి రావడానికి కాపులు కారణం కాదు. కానీ కాపుల కోసమే నేను వైసీపిలో చేరాను. మొలతాడు లేనివాడు (పవన్‌ కళ్యాణ్‌) కూడా నాకు రాజకీయ పాఠాలు చెప్తున్నాడు. మీ మాట నేనెందుకు వినాలి? మీరు చెప్పిన్నట్లు నేనెందుకు నడుచుకోవాలి?అసలు నాకు చెప్పడానికి ఆయన ఎవరు?

ఆయన సినిమాలలో హీరో కావచ్చు కానీ నేను నిజ జీవితంలో, రాజకీయాలలో కూడా ఎప్పుడూ హీరోనే! నేను పవన్ వద్దకు వెళ్ళకుండా జగన్‌ వద్దకు ఎందుకు వెళ్ళానంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. జగన్‌ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది కనుకనే వెళ్ళాను.

వైసీపి వ్యవస్థాపక సభ్యులలో నేను కూడా ఒకడిని. కానీ కొన్ని శక్తులు నన్ను జగన్మోహన్‌ రెడ్డికి, వైసీపికి దూరం చేశాయి. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత వైసీపిలో చేరి జగన్‌తో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎక్కడ నుంచి అవకాశం ఇచ్చినా నేను ఎన్నికలలో పోటీ చేస్తాను,” అని ముద్రగడ పద్మనాభం అన్నారు.

ప్రవీణ్ కుమార్‌ గురించి చెప్పుకుంటే, ఆయన ‘కేసీఆర్‌ దొర’ నిరంకుశ పాలనలో దళితులు నలిగిపోతున్నారని బీఎస్పీలో చేరి పార్టీ పగ్గాలు చేపట్టి శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు. బిఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రగతి భవన్‌ గేట్లు, గోడలు బద్దలు కొట్టుకొని లోనికి ప్రవేశించి బహుజనులకు రాజ్యాధికారం సాధించి పెడతానన్నారు.

కానీ ఆ ఎన్నికలలో బీఎస్పీ అభ్యర్ధులు ఎవరికీ డిపాజిట్లు కూడా రాలేదు. దీంతో ఆ కేసీఆర్‌ దొర ఇంటికే వెళ్ళి పొత్తులన్నారు. పొత్తులు ఎందుకు బీఎస్పీని వదిలేసి మా పార్టీలోకి వచ్చేయి… నాగర్‌కర్నూల్‌ ఎంపీ టికెట్‌ ఇస్తానన్నారు. మరో క్షణం ఆలస్యం చేయకుండా బీఎస్పీకి రాజీనామా చేసేశారు!

కానీ తాను ఎవరినీ మోసం చేయడం లేదని బహుజనుల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందంటూ పెద్ద ట్వీట్‌ వేశారు.

“పవన్‌ కళ్యాణ్‌ లేదా మరొకరు నాకు చెప్పేవారా? అయినా నేను వాళ్ళ మాట ఎందుకు వినాలి? నాకు చెప్పడానికి వాళ్ళు ఎవరు?” అని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ కూడా ఇదే మాట అంటే ఆయనకు అంత రోషం ఎందుకు వచ్చింది?

టికెట్‌ కోసం జగన్‌ పంచన చేరిన ముద్రగడ పద్మనాభం గొప్ప నాయకుడా లేక ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొంటున్నా జనసేన పార్టీని నడిపిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ గొప్ప నాయకుడా? పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నడవడం గొప్పా లేదా జగన్‌ ముందు చేతులు కట్టుకొని వెనక నడవడం గొప్పా?

చివరిగా ఒక్క మాట ముద్రగడ పద్మనాభం తనని ఎవరూ ప్రశ్నించకూడదనుకున్నప్పుడు, ఆయన కూడా పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయాలను ప్రశ్నించకూడదు కదా?

ఇప్పుడు ఈ ఇద్దరు కుల నాయకులను గమనిస్తే ఇద్దరూ తమ కులాల ప్రజలను ఉపయోగించుకొని పేరు ప్రతిష్టలు సంపాదించుకొని రాజకీయాలలోకి ప్రవేశించి తమ భవిష్యత్‌ చక్కబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది. ఈవిదంగా వ్యవహరిస్తుండటం వలన భవిష్యత్‌ ఎవరూ కూడా ఇటువంటి నాయాకులను నమ్మలేని పరిస్థితి కల్పించారు కదా?

ADVERTISEMENT
Latest Stories