జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందినవారైనప్పటికీ, గత ఎన్నికలలో కుల రాజకీయాలు చేయకపోవడం వలన ఆ వర్గం జనసేనకు దూరంగా ఉండిపోయింది. ఆ అనుభవం నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ ఈసారి మొట్ట మొదట కాపు పెద్దలతోనే సమావేశమయ్యి, పార్టీకి వారి మద్దతు కోరారు. వారిలో హరిరామజోగయ్య ఒకరు.
ముద్రగడ పద్మనాభంని స్వయంగా కలవలేకపోయినా తన ముఖ్యనేతలను పంపించి ఆయనను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటికి ఆయన వైసీపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. అయినా ముద్రగడ కోసం జనసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పవన్ కళ్యాణ్ చెప్పారు.
కాపు పెద్దలైన వీరిద్దరూ తనపై కోపంతో ఓ మాట అన్నా దానిని వారి ఆశీర్వాదంగానే స్వీకరిస్తానని పవన్ కళ్యాణ్ వారిద్దరి పట్ల చాలా గౌరవం ప్రకటించారు కూడా. అలాగే పవన్ కళ్యాణ్ మరికొన్ని కులాల పెద్దలతో కూడా సమావేశమయ్యి వారి మద్దతు కూడా కోరిన సంగతి తెలిసిందే.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈసారి ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో వైసీపి వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదనే పట్టుదలతో, పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా కాదని టిడిపితో పొత్తు పెట్టుకొని 24 సీట్లతో సర్దుకుపోవడానికి సిద్దపడ్డారు.
ప్రజలను కులాలవారీగా విడదీసి రాజకీయాలు చేయడం కాదు… అందరినీ కలుపుతూ, కలుపుకుపోతూ ముందుకు సాగాలనుకొంటున్నానని పవన్ కళ్యాణ్ తన ఆలోచనని చాలా స్పష్టంగానే చెప్పారు. వైసీపిని ఓడించి టిడిపి, జనసేనలను గెలిపించుకోవాలనే పవన్ కళ్యాణ్ నిబద్దతకు ఇవన్నీ చక్కటి నిదర్శనాలే.
రాష్ట్రంలో వైసీపి వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తుంటే, ముందుగా కాపు ఓటర్లనే నిలువునా చీల్చే ప్రయత్నాలు జరుగుతుండటం చాలా బాధాకరం. కానీ వారిని చీల్చుతున్నది ఎవరు?పవన్, జగన్, జోగయ్య, ముద్రగడ?అని ప్రశ్నించుకుంటే జగన్, జోగయ్య, ముద్రగడలే అని అందరికీ తెలుసు.
ఇంతకాలం పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను చీల్చి చంద్రబాబు నాయుడు పాదాల చెంత పెడుతున్నారంటూ వైసీపి దుష్ప్రచారం చేస్తోంది. ముద్రగడ, జోగయ్య ఇద్దరూ కూడా అలాగే మాట్లాడారు. కానీ ఇప్పుడు వారిద్దరి చేతే జగన్మోహన్ రెడ్డి కాపు ఓట్లను చీల్చేందుకు వ్యూహం పన్నుతుంటే, ఇంతకాలం పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులమని చెప్పుకున్న వారిద్దరూ పవన్ కళ్యాణ్ని ఓడిస్తామని ‘శపధం’ చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కలిసి పనిచేయడం తప్పనుకుంటే, మరి వారిద్దరూ జగన్మోహన్ రెడ్డితో చేతులు కలపడాన్ని ఏమనుకోవాలి?
పవన్ కళ్యాణ్కు ఏమీ తెలియదని, మేమే ఆయనకు మార్గదర్శనం చేస్తామంటూ గొప్పలు చెప్పుకొన్న వారిద్దరి చేతే జగన్మోహన్ రెడ్డి, కాపు సమాజాన్ని నిలువునా చీల్చి, తొలిసారిగా కాపులు జనసేన ద్వారా రాజ్యాధికారం పొందే అవకాశాన్ని దెబ్బ తీస్తున్నారు. వారి వేళ్ళతో వారి కళ్ళనే పొడుచుకునేలా చేస్తున్నారు.
కనుక ఇప్పుడు కాపు సామాజికవర్గంలో ప్రతీ ఒక్కరూ ఎవరితో నడవాలో ఆలోచించుకొని నిర్ణయించుకోవడం చాలా అవసరం.




