ఆ ముక్క చంద్రబాబు అంటే బాగుండేది కానీ జగన్‌ నోట… అబ్బే!

My Swearing in Ceremony Will Be in Visakhapatnam’ - Jagan

నేడు విశాఖలో జరుగుతున్న సదస్సులో ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పారిశ్రామికవేత్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, హైదరాబాద్‌ కోల్పోవడం వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్థలన్నీ హైదరాబాద్‌కే పరిమితం అయ్యాయన్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందన్నారు.

హైదరాబాద్‌, బెంగళూరు నగరాల కంటే విశాఖ నగరమే శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్రంలో చిన్న, మద్య తరహా పరిశ్రమలతో 30 లక్షల మందికి ఉద్యోగాలు రావడంతో నిరుద్యోగ సమస్య తగ్గిందన్నారు. అదే సమయంలో తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలతో రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయన్నారు.

ADVERTISEMENT

తమ ప్రభుత్వం ఇంతగా రాష్ట్రాన్ని విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ బురద జల్లుతున్నాయని సిఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకం కాదన్నారు. రాబోయే ఎన్నికలలో గెలిచిన తర్వాత తాను విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్మోహన్‌ రెడ్డి చెప్పారు.

రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ళ తర్వాత కూడా ఇంకా హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండాలి… హైదరాబాద్‌ని కోల్పోవడం వలన నష్టపోయామని ఓ ముఖ్యమంత్రి నోట వినాల్సిరావడం చాలా హాస్యస్పదంగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

ఆ పరిస్థితులలో ఆయన హైదరాబాద్‌ కోల్పోవడం వలన నష్టపోయామని అంటే అర్దం చేసుకోవచ్చు. కానీ హైదరాబాద్‌లోనే ఉండిపోతే ఎప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేమని చెప్పి, అప్పుడే ఆయన ప్రభుత్వాన్ని హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలించి తీసుకువచ్చేశారు. కానీ ఐదేళ్ళ పాలన తర్వాత హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండాలని జగన్‌ కోరుకొంటున్నారు!

చేతిలో చిల్లి గవ్వ లేని ఆ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ఇంత బేలగా మాట్లాడలేదు. చాలా నిబ్బరంగా సమస్యలని పరిష్కరించుతూ, ఒకేసారి అమరావతి, పోలవరం పనులను చేపట్టి ముందుకు తీసుకువెళ్ళారు. చంద్రబాబు నాయుడు చేసిన కృషి వలన రాష్ట్రానికి ఐకియా వంటి అనేక పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు తరలివచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌ గాడిన పడి, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడినప్పుడు, రాష్ట్రంలో ప్రభుత్వం మారింది! వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు జగన్మోహన్‌ రెడ్డికి అప్పగిస్తే కేవలం ఐదేళ్ళలోనే ఆంధ్రప్రదేశ్‌ ఏ దుస్థితికి చేరుకుందంటే సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టుకొని అప్పు తెచ్చుకొనే అంతగా!

ఒకవేళ అది నిజం కాదనుకున్నా ‘రాజధాని నిర్మించడం మా వల్ల కాదు కనుక మళ్ళీ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా చేయాలని చెప్పుకోవడం నిజమే కదా?

ఉన్న పరిశ్రమలే బయటకు వెళ్లిపోతుంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎలా తగ్గుతుంది?అంటే డిగ్రీ చేసిన యువత సర్టిఫికెట్లు, పొట్ట చేతపట్టుకొని ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతుండటం వలననే. సంక్రాంతి పండుగ వస్తే హైదరాబాద్‌ ఖాళీ అయిపోతుండటమే ఇందుకు నిదర్శనం కాదా?

విశాఖని రాజధానిగా చేయాలనుకున్నప్పుడు జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరాన్ని అభివృద్ధి చేసి ఉంటే కనీసం ఆ మాట చెప్పుకోవడానికి ఉండేది. కానీ ఈ 5 ఏళ్ళలో జగన్‌ ప్రభుత్వం విశాఖలో కొత్తగా ఒక్క ఫ్లైఓవర్‌ కూడా నిర్మించలేదు.

దాంతో నగరంలో ఉన్న జనాభా, వాహనాలకే రోడ్లు సరిపోక నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. నగరంలో అనేక చోట్ల కనీసం స్ట్రీట్ లైట్స్ ఉండవు. ఉన్నా వెలగవు. ఎక్కడ చూసినా మురుగు కాలువలు పొంగి ప్రవహిస్తుంటాయి. అయినా కూడా హైదరాబాద్‌, బెంగళూరు నగరాల కంటే విశాఖలో మౌలిక వసతులు, అభివృద్ధి బాగుందని జగన్మోహన్‌ రెడ్డి చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

తన పాలన, తన ఆలోచనలు, విధానాలు, అభివృద్ధి అన్నీ ఇంత అద్భుతంగా ఉన్నమాటే వాస్తవమైతే ఇంకా హైదరాబాద్‌ గురించి ఏడుపు, ఆలోచనలు దేనికి?

విశాఖకు మకాం మరుస్తానని చెప్పి వందల కోట్లు పెట్టి విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారే కానీ వాటిలో ఎందుకు దిగలేకపోతున్నారు. దిగలేమని తెలిసి ఉన్నప్పుడూ వందల కోట్లు ఎందుకు ఖర్చు చేసిన్నట్లు?

అయినా ఓ పక్క హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని ఆలోచనలు చేస్తూ, ఎన్నికలలో గెలిస్తే విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తానంటూ జగన్‌ మళ్ళీ మరో కొత్త డేట్ ప్రకటించడం విచిత్రంగా ఉంది కదా?

ADVERTISEMENT
Latest Stories