జనసేన అధినేత పవన కళ్యాణ్ సోదరుడు జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు రాష్ట్ర కేబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర పర్యవరణ, అటవీ శాఖ ఉతర్వులు జారీ చేసింది. దీనితో కూటమి ప్రభుత్వంలో జనసేనకు మరో గౌరవం దక్కినట్లయింది.
నాగబాబు పొలిటికల్ ఎంట్రీ నుంచి ఇప్పటి వరకు ఆయన రాజకీయ ప్రయాణం పై అనేక వార్తలు అనేకానేక ఊహాగానాలు కథనాలుగా ప్రచారం అయ్యాయి. జనసేన ఎమ్మెల్యే గా ఎంపీ గా అంటూ మొదలైన ప్రచారం చివరికి రాజ్యసభ, మంత్రి పదవి వరకు వ్యాపించింది.
కట్ చేస్తే ఆ ప్రచారం కాస్త నాగబాబు ఎమ్మెల్సీ పదవితో ముగిసింది. అయితే పవన్ సోదరుడిగా నాగబాబు కి ఎమ్మెల్సీ గౌరవం ఇస్తూనే ఆయనను ప్రభుత్వం కేబినెట్ లోకి తీసుకోబోతుంది అంటూ జరిగిన ఈ ప్రచారానికి ఇప్పుడు నాగబాబుకి కేబినెట్ ర్యాంక్ తో జవాబు చెప్పింది కూటమి ప్రభుత్వం.
ఈ మేరకు నాగబాబుని ఏపీ పర్యటక, అటవీశాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడం, అడవుల విస్తరణ కు ప్రాధాన్యం కల్పించడం, పర్యావరణ సమతుల్యత, గ్రీన్ ప్రోజెక్టుల పరిశీలిన వంటి బాధ్యతలను ఈ కమిటీ ద్వారా నాగబాబు నిర్వహించనున్నారు.
అయితే నాగబాబుకి ఇచ్చిన ఈ కేబినెట్ హోదా కేవలం ఆయనకు దక్కిన గౌరవం మాత్రమే కాదు కూటమి ప్రభుత్వంలో జనసేనకు పెరిగిన ప్రాధాన్యతగా భావించవచ్చు. దీనితో టీడీపీ – జనసేన మధ్య రాజకీయ బంధం మరింత బలపడే అవకాశం కనిపిస్తుంది.
అయితే నాగబాబు తనకు దక్కిన ఈ హోదాను ఏ మేరకు వినియోగించుకుని అటు పార్టీకి ఇటు కూటమి ప్రభుత్వానికి బలంగా మార్చుతారు అనేది రానున్న రోజులలో తేలనుంది.




