ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కూడా ఈ ఎన్నికలు టిడిపికి, రాష్ట్రానికి ఎంత కీలకమైనవో గుర్తించి, ప్రజల మద్య తిరుగుతూ పార్టీకి బలం కూడగడుతున్నారు.
మరోపక్క చంద్రబాబు నాయుడు కూడా మండుతున్న ఎండలను లెక్కచేయకుండా ప్రజాగళం పేరుతో ప్రజల మద్య తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీలో వీరిద్దరి కృషి వలన టిడిపి ఓట్ల శాతం ఖచ్చితంగా పెరుగుతుందని వేరే చెప్పక్కరలేదు.
ఇంత వయసులో వారిద్దరూ ఇంతగా శ్రమిస్తుంటే, టిడిపిలో కొందరు నేతలు ఎండలకు భయపడి ఇళ్ళలో నుంచే బయటకు రాకుండా కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు పార్టీ కార్యాలయాలలో ప్రెస్మీట్లకు పరిమితం అవుతున్నారు. సీట్ల బాట్లలో టికెట్స్ దక్కని కొందరు నేతలు ప్రెస్మీట్లు పెట్టి మరీ పార్టీపై ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు.
టిడిపిలో పరిస్థితి ఇలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలవాటు ప్రకారం కొన్ని రోజులు మాయమైపోయి మళ్ళీ నేటి నుంచి వారాహితో ప్రజల మద్యకు రాబోతున్నారు.
చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాలు, అభ్యర్ధు ల ఎంపిక విషయంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిత్యం ప్రజల మద్యనే ఎండల్లో పడి తిరుగుతుంటారు. టిడిపి, చంద్రబాబు నాయుడుతో పోలిస్తే జనసేన, పవన్ కళ్యాణ్కు ఒత్తిడి కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ పార్టీకి అత్యంత కీలకమైన ఇటువంటి సమయంలో కూడా పవన్ కళ్యాణ్ మద్యలో ఎందుకు గ్యాప్ తీసుకుంటారో తెలీదు.
అయితే లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తుంటారు కనుక పవన్ కళ్యాణ్ జనం మద్యకు వచ్చిన ప్రతీసారి వైసీపిలో ప్రకంపనలు మొదలవుతుంటాయి. సీట్ల సర్దుబాట్ల వ్యవహారంలో జనసేనలో అలకపాన్పుల సీన్లు పూర్తయిన్నట్లే ఉన్నాయి. కనుక పవన్ కళ్యాణ్ ఇక నుంచి మే 13న పోలింగ్ పూర్తయ్యేవరకు గ్యాప్ తీసుకోకుండా ప్రజలు, పార్టీ శ్రేణుల మద్య ఉంటే అందరికీ మంచిది.
టిడిపి, జనసేన, బీజేపీల కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ లేనట్లే వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు. టిడిపి, జనసేనలు పొత్తులు ఖరారు చేసుకోగానే రెండు పార్టీల నేతలతో సమన్వయ కమిటీలు వేసుకొని ఉమ్మడి కార్యాచరణ చేపడుతుండేవి. వాటితో బీజేపీ కలిసిన తర్వాత అటువంటి ప్రయత్నమేదీ చేసిన్నట్లు కనబడదు.
వాటితో బీజేపీ కలవలేకపోతోంది లేదా ఆ రెండు పార్టీలే బీజేపీతో కలవలేకపోతున్నారు. కనుక టిడిపి, జనసేన- బీజేపీల మద్య గ్యాప్ ఇంకా అలాగే కనబడుతోంది.
ఎన్నికలకు కేవలం 45 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. కానీ ఇంతవరకు మూడు పార్టీలు కలిసి సభలు, సమావేశాలు నిర్వహించలేకపోతున్నాయి.
కనుక ఇప్పటికైనా మూడు పార్టీలు కలిసి పనిచేస్తూ తమ మద్య గ్యాప్ తగ్గించుకోవడం, గ్యాప్ లేదని ప్రజలకు నిరూపించుకోవడం చాలా అవసరం. లేకుంటే మూడు పార్టీల మద్య ఓట్ల బదలాయింపు జరిగే అవకాశం ఉండదు. కారణాలు ఏవైనప్పటికీ వాటి మద్య కనబడుతున్న ఈ గ్యాప్ వలన అవి నష్టపోతే, ఆ మేరకు వైసీపి లబ్ధి పొందుతుందని మరిచిపోకూడదు.




