టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిన్న బాపట్లలో రోడ్ షో నిర్వహించినప్పుడు కూడా వేలాదిగా జనాలు తరలిరావడంతో పట్టణంలో రోడ్లన్నీ నిండిపోయాయి. ఎక్కడ చూసిన ఇసుక వేస్తే రాలనంతగా జనాలే. వారిని చూసి చంద్రబాబు నాయుడు కూడా చాలా ఉత్సాహంగా ప్రసంగించారు. రాష్ట్రానికి భారీగా ఆదాయం తెచ్చిపెట్టే ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకోవలసి ఉండగా జగన్ ప్రభుత్వం దానిని సర్వనాశనం చేసేసిందని అన్నారు.
రాష్ట్ర భవిష్యత్కి ఎంతో కీలకమైన అమరావతి, పోలవరాన్ని కూడా భ్రష్టు పట్టించేసిందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రప్పించిన పారిశ్రామికవేత్తలు వైసీపీ నేతలు బెరిదింపులకి భయపడి పరిశ్రమలను మూసుకొని పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పనులన్నీ నిలిపివేసి మద్యం మాఫియా, ఇసుక మాఫియా, డ్రగ్స్ మాఫియాలను పెంచి పోషిస్తోందని అన్నారు. చివరికి విద్యావ్యవస్థను కూడా పూర్తిగా భ్రష్టు పట్టించేస్తూ ఉపాధ్యాయులను జగన్ ప్రభుత్వం వేదిస్తోందని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కడ పర్యటిస్తున్నా వేలాదిగా జనాలు తరలివస్తున్నారు. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బహిరంగసభలో నిర్వహిస్తున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పూనుకొని జనసమీకరణ చేసి జనాలను తీసుకురావలసి వస్తోంది. చంద్రబాబు నాయుడు రోడ్ షోలలో జనాలు ఉత్సాహంగా పాల్గొటుంటే, సిఎం జగన్ సభకి తీసుకువచ్చిన జనం మద్యలోనే లేచి వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు నాయుడు బటన్ నొక్కడం లేదు. ఎవరికీ రూపాయి ఇవ్వడం లేదు. అయినా జనాలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు!
సిఎం జగన్ బటన్ నొక్కి వందల కోట్లు పంచిపెట్టడానికే సభలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయన మాట్లాడుతుండగానే జనాలు లేచి వెళ్ళిపోతున్నారు. ఎందుకిలా?లోపం ఎక్కడుంది? ఎక్కడ తేడా కొడుతోంది?అని వైసీపీ నేతలు బుర్రలు పట్టుకొంటున్నారు.
డబ్బెవరికి చేదన్నట్లు ప్రభుత్వం సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు ఉచితంగా డబ్బు పంచిపెడితే తప్పక తీసుకొంటారు. కానీ దాంతో పాటు రాష్ట్రాభివృద్ధి కూడా జరగాలని కోరుకొంటారు. రాష్ట్రంలో లేదా తమ జిల్లా, నియోజకవర్గంలో చేపట్టిన చేపట్టబోతున్న అభివృద్ధి పనుల గురించి సిఎం జగన్ నోట వినాలనుకొంటారు. కానీ ఇంతవరకు సిఎం జగన్ నిర్వహించిన సభలలో 75-85 శాతం సంక్షేమ పధకాలకి బటన్ నొక్కుడు సభలే!
ఆ సభలలో కొంత సేపు సొంత డబ్బాకి, మిగిలిన సమయం టిడిపి, జనసేనలని తిట్టిపోయడానికే సరిపోతోంది. ఈ ప్రసంగాలు వినీవినీ ప్రజల చెవులు చిల్లులు పడుతున్నాయి. పైగా మెడ మీద కత్తిపెట్టినట్లు బలవంతంగా సభలకి తీసుకువచ్చి జగన్కి జేజేలు పలకాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తుండటంతో ప్రజలు మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మంత్రులు నిర్వహించే సభలలో అధిక శాతం మూడు రాజధానుల పేరుతో ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఉద్దేశ్యించినవే. అభివృద్ధి పనుల శంకుస్థాపనలకి లేదా ప్రారంభోత్సవాల కోసం నిర్వహించిన సభలు చాలా తక్కువ. దేశముదురు వైసీపీ నేతలు ప్రజల ఆకాంక్షలు గుర్తించలేదనుకోలేము. కానీ పిల్లి మెడలో గంట ఎవరు కడతారన్నట్లు వారు కూడా తమ జగనన్న భజన చేస్తూ గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. మరి జనాలు రమ్మంటే ఎందుకు వస్తారు?



