టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మళ్ళీ కుప్పం నుంచే పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. ఆయన తరపున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్స్ దాఖలు చేయబోతున్నారు. ముందుగా ఆమె కుప్పంలోని ప్రసన్న వరద రాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయించారు.
ఆ తర్వాత స్థానిక చర్చి, మసీదులో కూడా ఆమె ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. ఆమె వెంట టిడిపి నేతలతో పాటు పలువురు జనసేన, బీజేపీ నేతలు, మూడు పార్టీలకు చెందిన వందలాది కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టిడిపి యువనేత నారా లోకేష్ గురువారమే మంగళగిరిలో నామినేషన్స్ దాఖలు చేశారు.
ఈసారి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లను వారు పోటీ చేయబోతున్న కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలలోనే ఓడిపోబోతున్నారని కనుక ఇద్దరూ వేరే నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారంటూ వైసీపి దుష్ప్రచారం చేసింది. కానీ వారు మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేసేందుకు నామినేషన్స్ వేయడం వైసీపికి చెంపదెబ్బ వంటిదే అని చెప్పవచ్చు.
వైనాట్ కుప్పం? అని ప్రశ్నించిన జగన్, నేటికీ కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడు వెంటే ఉన్నట్లు గ్రహించినట్లే ఉన్నారు. కనుక కుప్పంలో ఎన్నికల ప్రచారం కోసం తిరిగి పుణ్యకాలం వృధా చేసుకోవడం లేదు. దీంతో జగన్ను నమ్ముకొని కుప్పం నుంచి వైసీపి అభ్యర్ధిగా పోటీకి దిగిన కేజే భరత్ పరిస్థితి అయోమయంగా మారింది.
ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేయరని వైసీపి దుష్ప్రచారం చేసింది. కానీ వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డిని పక్కన పెట్టి, గంజి చిరంజీవిని అభ్యర్ధిగా ప్రకటించింది. మళ్ళీ ఆయనను మార్చి మురుగుడు లావణ్యని అభ్యర్ధిగా ప్రకటించింది. అంటే మంగళగిరిలో పోటీ చేయడానికి వైసీపియే భయపడుతోందని స్పష్టమైంది.
తమని పక్కన పెట్టినందుకు వారిద్దరూ మొదట చాలా ఆవేదన చెందినప్పటికీ ఇప్పుడు చాలా సంతోషిస్తున్నారు. మంగళగిరిలో పోటీ చేసి నారా లోకేష్ చేతిలో ఓడిపోవడం కంటే, జగన్ తమకు టికెట్ ఇవ్వనందున పోటీ చేయలేకపోయామని చెప్పుకొంతున్నారు. మురుగుడు లావణ్య టికెట్ ఇచ్చినప్పుడు చాలా సంతోషించారు కానీ ఓటమి తప్పదని గ్రహించిన తర్వాత ఇప్పుడు ముందుకు, వెనక్కు వెళ్ళలేక తాపీగా బాధపడుతున్నారు.




