టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సోమవారం ఉదయం పలమనేరు నియోజకవర్గంలోని అన్నవరం నుంచి 4వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించి, పడిగల కుప్పం, దాసర్లపల్లి, కోరకుంట, గాంధార మాకులపల్లి, వెంకటగిరి కోట మీదుగా ముందుకు సాగుతున్నారు. దారిలో రైతులతో మాట్లాడుతూ, వ్యవసాయ మోటర్లకి ప్రభుత్వం మీటర్లు బిగించడం వెనుక అసలు రహస్యం నారా లోకేష్ విడమరిచి చెప్పారు.
“రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమలో భూగర్భ జలాలు చాలా దిగువకి ఉంటాయి. కనుక బోరుబావుల నుంచి నీటిని తోడి పొలాలకి నీళ్ళు పెట్టుకోవాలంటే చాలా విద్యుత్ వినియోగించుకోవలసి వస్తుంది. ఇక్కడే జగనన్న తెలివి తేటలు ప్రదర్శించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెపుతూనే వ్యవసాయ మోటర్లకి మీటర్లు బిగింపజేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఉచితంగానే విద్యుత్ ఇస్తోందనే ఉద్దేశ్యంతో రైతులు పాతాళంలో ఉన్న నీటిని మోటర్లతో తోడి పోసేందుకు వెనకాడటం లేదు.
అప్పుడు కరెంటు ఎక్కువ వాడుకొంటే యూనిట్లు పెరుగుతాయి. విద్యుత్ యూనిట్లు పెరిగితే ఆ వంకతో ఇక పించనుకి అర్హత లేదని కోసి పడేస్తారు. జగనన్న ముందు పించనులకి విద్యుత్ వినియోగానికి లంకె పెట్టడం వెనుక అసలు రహస్యం ఇదే. ఓ పక్క వ్యవసాయానికి ఉచిత ఇస్తున్నామని చెపుతూనే మోటర్లకి మీటర్లు పెట్టి మీ పించనులు తొలగిస్తున్నారు,” అని నారా లోకేష్ రైతులకి వివరించారు.
వైసీపీ ప్రభుత్వం కుంటిసాకులు చూపుతూ పించనులు తొలగిస్తోందని మీడియాలో వార్తలు వస్తే మంత్రులు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని గట్టిగా ఖండించారు. కానీ వైసీపీకే చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా తన నియోజకవర్గంలో ప్రభుత్వం పించనులు తొలగిస్తోందని నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అది ఏవిదంగా కత్తిరిస్తోందో నారా లోకేష్ వివరించారు అంతే!



