టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై మొదట పెదవి విరిచిన వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఆయన చేస్తున్న సవాళ్ళకు, సెల్ఫీ సవాళ్ళకు జవాబు చెప్పలేక, మౌనంగా ఉండలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే, నారా లోకేష్ సదరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు నేతల అక్రమాలు, అవినీతి, ఇసుక మాఫియా వగైరాలను ఫోటో సాక్ష్యాధారాలతో సహా చూపించి నిలదీస్తున్నారు కనుక. ధర్మవరంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, కుటుంబ సభ్యులు, అనుచరుల భూకబ్జాల గురించి నిలదీశారు. దానికి కేతిరెడ్డి సంతృప్తికరమైన సమాధానం చెప్పుకోలేక తడబడ్డారు.
ఇప్పుడు నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏవిదంగా ఇసుక దోపిడీ చేస్తున్నారో సెల్ఫీతో చూపించారు. “అబ్బాయ్ కేతిరెడ్డి కబ్జాలు ధర్మవరంలో చూశాం. తాడిపత్రిలో బాబాయ్ కేతిరెడ్డి దోపిడీలో అబ్బాయ్ని మించిపోయాడు. పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాఫియా పెద్దఎత్తున ఇసుక తవ్వి తరలించే రీచ్ ఇది. ఇసుక తవ్వకాలకు 10 ఎకరాలు కేటాయిస్తే, పదింతల విస్తీర్ణంలో తవ్వకాలకి బరితెగించారు. ప్రతి రోజు ఈ రీచ్ నుండి సుమారుగా 150 టిప్పర్ల ఇసుక తరలిస్తోంది బాబాయ్ గ్యాంగ్. నేను వస్తున్నానని తెలిసి రెండు రోజుల క్రితమే రీచ్ బంద్ చేసినా, ఇసుక మాఫియా విధ్వంసం ఆనవాళ్లు అలాగే ఉన్నాయి,” అంటూ ట్వీట్ చేశారు.
మంగళవారం సాయంత్రం పాదయాత్ర చేస్తుండగా దారిలో టిడిపి అభిమానులు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ బ్యానర్ వద్ద నారా లోకేష్ ఆగి సెల్ఫీ దిగి దానినీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ చిత్రపటంతో ఉన్న ఆ బ్యానర్లో వీటిలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది? 1. పులివెందుల? 2. అమరావతి? 3. కర్నూల్? 4. వైజాగ్? కనుగొన్నవారికి రూ.1,00,000/- శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా బహుమతి అందించబడును.”
పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇసుక మాఫియా గురించి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని నారా లోకేష్ సవాళ్ళకు వైసీపీ నేతలు ఎవరైనా సమాధానం చెప్పగలరా?



