పడ్డ చోటే లేస్తా…నిలబడతా..నిలబెడతా..అంటూ పట్టుదలతో మంగళగిరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని తన గెలుపు కోసం అలుపెరుగని కృషి చేస్తున్నారు నారా లోకేష్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు తడుతూ ప్రతి గడప తొక్కుతూ సీనియర్ లీడర్లు కూడా తన వైపు చూసేలా మంచి ప్రణాళికలతో గెలుపు దిశగా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నారు.
ఒకప్పుడు మైకు పట్టుకుంటే ప్రత్యర్థి పార్టీ వారికీ విమర్శించే అవకాశం కల్పించే లోకేష్ ఇప్పుడు అదే మైకు పట్టుకుని ప్రత్యర్థి పార్టీల నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఒక్క ఓటమి తాలూకా అవమానం మనిషిలో ఇంత పట్టుదల పెంచగలదా అనేలా లోకేష్ మారిపోయారు. 2019 లో జరిగిన ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాలలో పోటీకి దిగిన లోకేష్ ఒక ముఖ్యమంత్రి మనవడిగా..ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా ప్రజల ముందుకు వచ్చారు.
అయితే తండ్రి పేరో..తాత పేరో..పార్టీ పేరు అడ్డుపెట్టుకుని సునాయాసంగా గెలిచే స్థానాన్నిఎంచుకోకుండా…అసలు పార్టీకి బలమే లేని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని తన బలాన్ని పార్టీకి చూపించాలని ఆశ పడిన లోకేష్ ను ఓటమి పలకరించింది. అయితే ఓటమి తన సంకల్పాన్ని ఆపలేదు అనేలా ఓడిన చోటే తిరిగి గెలిచి పార్టీ జెండా ఎగరేయాలని గట్టి పట్టుదలతో ఉన్న లోకేష్ ఓడిన నాటి నుంచి నేటి వరకు స్థానిక ప్రజలకు, పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉంటూ పార్టీని పూర్తి స్థాయిలో బలపరచగలిగారు.
లోకేష్ ను ఓడించే వ్యూహంలో భాగంగా జగన్ ఒక్క మంగళగిరి నియోజకవర్గానికే ముగ్గురు ఇంచార్జ్ లను మార్చేస్తాయికి ప్రత్యర్థి బలాన్ని తగ్గించి తన బలాన్ని, పార్టీ భవిష్యత్తుని పెంచుకున్నారు లోకేష్. ఒక పార్టీ అధినేత కుమారుడిగా, మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా కాకుండా ఒక సాధారణ పార్టీ నాయకుడిగా లోకేష్ తన నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు.
ఓడించారే…అంటూ ఎవరిని నిందించలేదు, ఓడిపోయానే…అంటూ ఎవరికీ భయపడను లేదు, ఇక గెలవలేము అని నిరాశ చెందను లేదు. ఓర్పుతో..ఓపికతో..అవకాశం కోసం ఎదురు చూడక…తన అవసరం ఏంటి అనేది నియోజకవర్గ ప్రజలకు తెలియచెప్పాడు. ఇప్పుడు గతంలో మాదిరి లోకేష్ ప్రసంగాల మీద విమర్శలు చేసే అవకాశాన్ని ప్రత్యర్థి పార్టీ నేతలకు ఇవ్వకుండా జాగ్రత్త పడుతూనే…ప్రత్యర్థులను తన ప్రసంగాలతో ఇరుకున పెట్టగల స్థాయికి లోకేష్ ఎదిగారు.
చంద్రబాబు ను అరెస్టు చేసి టీడీపీ పార్టీని ఏపీలో తుదముట్టించాలని అని చూసిన వైసీపీ నాయకులకు దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా తనతో ఓపెన్ డిబేట్ కు వచ్చే దమ్ముందా సీఎం గారు అంటూ జగన్ కు సవాల్ చేసి అటు వైసీపీ కి నోరెత్తలేని కౌంటర్ ఇస్తూనే టీడీపీ క్యాడర్ కు గొంతెత్తి పోరాడగలిగే ఆత్మస్తైర్యాన్ని అందించారు. తల్లిని అవమానించారనో…తండ్రిని కించపరుస్తున్నారనో…తనను అవహేళన చేస్తున్నారనో…భయపడి తానూ వెనకడుగు వేయలేదు అలాగే పార్టీ క్యాడర్ ను వెనకడుగు వేయించలేదు.
ఎప్పటికప్పుడు పార్టీ కార్యకర్తలను సమన్వయ పరచుకుంటూ, తానున్నాను అనే భరోసా కల్పిస్తూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఈ ఐదేళ్లు ఏదోఒక రూపంలో నిత్యం ప్రజల మధ్యే ఉన్నారు. యువగళంతో మొదలు పెట్టిన లోకేష్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల పట్ల లోకేష్ ధృకపదాన్ని పూర్తిగా మార్చాయనే చెప్పాలి. తనను తన పార్టీని ఎవరు వేలెత్తి చూపించిన అది అధికార పార్టీ అయినా, వారికీ కొమ్ముకాసే బ్లూ మీడియా అయినా ఎటువంటి తడబాటు లేకుండా కౌంటర్లు ఇస్తూ పార్టీ క్యాడర్లో కాబోయే నాయకుడు అనేలా నమ్మకాన్ని సృష్టించుకోగలిగారు లోకేష్.




