ఈసారి ఎవరికీ ‘బీపీ’లు వచ్చాయి సార్..!

Nara Lokesh

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల మీద వైసీపీ కార్యకర్తలు చేస్తున్న విధ్వంస కాండను ఎప్పటికప్పుడు సమర్థిస్తూ పోతున్న ముఖ్యమంత్రి జగన్ తాజాగా జరిగిన పల్నాడు టీడీపీ ఆఫీస్ దగ్ధం ఘటనను కూడా సమర్థిస్తారా..? అంటూ టీడీపీ కార్యకర్తలు జగన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ADVERTISEMENT

గతంలో తాడేపల్లి నగర్ శివారులో, డీజీపీ ఆఫీసుకు కూత వేటు దూరంలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం మీద పట్టపగలే కిరాయి గుండాలు మాదిరి వైసీపీ కార్యకర్తలు చేసిన దాడి ఇప్పటికి కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. దాడి జరగడమే ఒక భయానక సంగటన అయితే ఆదాడిని సమర్థిస్తూ సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించడం మరో భయానక దృశ్యం అయ్యింది.

నన్ను, నా పార్టీ ని తిడితే నా ఆపార్టీ కార్యకర్తలకు బీపీలు రావా, వారికీ బీపీలు వచ్చాయి దాని ఫలితమే ఈ విధ్వంసం అంటూ దాడి సంఘటనను చాలా క్యాజువల్ గా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే వైసీపీ కి వ్యతిరేకంగా గళం విప్పితే ఇలానే దాడులు జరుగుతాయి అంటూ జగన్ పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరికలు పంపారా అనే అనుమనాలు కూడా లేవనెత్తారు పలువురు ప్రజాస్వామ్యవాదులు.

ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇలా ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల పై నిప్పు పెట్టడం వెనుక అధికార పార్టీ హస్తం ఉందనేది టీడీపీ వాదన. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు లో టీడీపీ ఆఫీస్ కు నిన్న రాత్రి కొందరు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో తాటాకులతో వేసిన ఆఫీస్ పూర్తిగా దగ్దమైపోయింది. మొన్న క్రోసూరు ప్రజాగళంకు వచ్చిన స్పందన సహించలేకనే వైసీపీ కిరాయిమూక ఈ ఘాతుకానికి సిద్దపడ్డారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఘటనను ఖండించారు.

అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ ఎన్నికలలో వైసీపీకి ఓటమి భయం పట్టుకుని ఇలాంటి ఘటనలకు పాల్పడుతుందని, టీడీపీ సభలకు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకనే వైకాపా నేతలు ఇటువంటి నీచరాజకీయాలకు తెరలేపారు, క్రోసూరు లో వైసీపీ ఉన్మాదం హద్దులు దాటింది, దాడులు, విధ్వంసాలతో టీడీపీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బ తీయలేరు, దీనితో ప్రజా తీర్పులో మార్పు రాబోదు అంటూ ఘటన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు లోకేష్.

రౌడీయిజం, విధ్వంసం…వైసీపీ నైజం, ఈ ఎన్నికలలో ప్రజలు వైసీపీ ని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారంటూ బాబు.., టీడీపీ శ్రేణుల సహనాన్ని చేతకాని తనంగా భావించవద్దు అంటూ లోకేష్…టీడీపీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని, వైకాపా శ్రేణులకు హెచ్చరికలు ఏకకాలంలో పంపారు. ఇక వైసీపీ బీపీలకు కూటమి విజయమే సరైన మందు అంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories