ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుంది, అందుకే తాడేపల్లిలో తాను గృహాన్ని నిర్మించుకున్నానని గత ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పుకొచ్చిన జగన్ మోహన్ రెడ్డి, ఆ తర్వాత రాజధాని విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాడేపల్లిలోనే నివాసం ఉంటోన్న జగన్ కు ప్రస్తుతం చుక్కెదురయ్యే పరిస్థితులు ఎదురు కాబోతున్నాయనే సంకేతాలు కనపడుతున్నాయి.
జగన్ నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గం నుండి గత ఎన్నికలలో నారా లోకేష్ పై వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికలలో డబ్బులు ఏరులైపారిన నియోజకవర్గాలలో గాజువాక, భీమవరంలతో పాటు మంగళగిరి కూడా ఒకటి.
ఎలా అయినా లోకేష్ గెలుపును అడ్డుకోవడానికి ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు కరెన్సీ కట్టలను కూడా ప్రస్తుత అధికార పార్టీ పంచిపెట్టిన వైనం స్థానికులకు సుపరిచితం. అయితే ఈ సారి జగన్ వేసే పాచికలు మంగళగిరి నియోజకవర్గంలో ఏ మాత్రం పని చేసే అవకాశం లేదని రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోన్న మాటలు.
2019 ఓటమి నుండి కోలుకున్న లోకేష్ ఏడాది లోపునే మంగళగిరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని నిరంతరం ప్రజలతో మమేకం కావడమే కాకుండా, స్థానికంగా రహదారులు, మంచినీటి వసతిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల అవసరాలు తీర్చుకుంటూ వచ్చారు. దీంతో ఓటమి నుండి గెలుపు తధ్యం అనే స్థాయికి లోకేష్ గమనం చేరుకుంది.
మరోవైపు లోకేష్ పై గెలిస్తే ఆర్కేని మంత్రిని చేస్తానని వాగ్దానం చేసిన జగన్, యధావిధిగా మడమ తిప్పి, ఆర్కేని కేవలం తన రాజకీయ కేసుల అవసరాల నిమిత్తం మాత్రమే వినియోగించుకున్నారు. దీంతో ఆర్కేపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడడంతో అభ్యర్థి మార్పు అనివార్యంగా మారి, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అనుభవం గడించిన కాండ్రు కమల కుమార్తె లావణ్యకు సీటును అప్పగించారు.
అయితే లోకేష్ విజయం ‘నల్లేరు మీద నడక’ అన్న టాక్ బలంగా వినిపించడంతో మరోసారి కుల రాజకీయాలకు జగన్ తెరలేపారు. బీసీలకు సీటు ఇవ్వకుండా స్వయంగా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారంటూ ‘కుల’ ప్రకంపనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా లోకేష్ విరివిగా డబ్బులు పంచుతున్నారంటూ బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్.
స్వయంగా ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న అసెంబ్లీ స్థానం కావడంతో, జగన్ మోహన్ రెడ్డికి మంగళగిరి నియోజకవర్గం గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఓ విధంగా పులివెందులలో జగన్ విజయం ఎంత కీలకమో, మంగళగిరిలో కూడా వైసీపీ విజయం జగన్ కు అత్యంత కీలకం. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉండడంతో, కులాల కంపుని కదిపే ప్రయత్నం చేసారు.
మరోవైపు లోకేష్ తన విజయమే అజెండాగా ప్రజలతో మమేకం అవుతూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా అపార్టుమెంట్లు, గృహ సముదాయాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు, 2024 ఎన్నికలలో ‘కూటమి’ విజయం రాష్ట్రానికి ఎంత కీలకమనేది ప్రజలకు వివరిస్తున్నారు.
25 ఏళ్ళ నుండి టీడీపీ జెండా ఎగరనటువంటి మంగళగిరి నియోజకవర్గంలో, ప్రస్తుతం పసుపు జెండా రెపరెపలాడేలా చేయడంలో లోకేష్ సఫలీకృతులయ్యారు. ఇప్పుడే అదే జగన్ కు మింగుడు పడని అంశంగా మారింది. పక్కలో బల్లెంలా జగన్ కు చుక్కలు చూపించడంలో లోకేష్ ప్రస్థానం ప్రశంసనీయం.




