అయ్యో పాపం! తండ్రికి వైద్యం చేయించాలని ఆత్మహత్య చేసుకుంది కానీ..

Nellore woman suicide case

ఇటీవల మీడియాలో వస్తున్న హత్యలు, ఆత్మహత్యల వార్తలు చూస్తున్నప్పుడు ఈ సృష్టిలో అందరి కంటే తెలివైన మనుషులు ఇంత తెలివి తక్కువగా లేదా అనాలోచితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? చనిపోవడానికి ఇంత ఆవేశం, తొందరపాటు దేనికి? ఇలాంటి కారణాలతో కుటుంబ సభ్యులని లేదా సాటి మనుషులను చంపేయడానికి మనసెలా ఒప్పింది?అనే సందేహాలు కలుగుతాయి.

అటువంటి విషాద ఘటనే నెల్లూరు జిల్లాలో మరొకటి జరిగింది. జిల్లాలో ఓ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఓ యువటి (27) ఎవరూ లేని సమయంలో సచివాలయంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ADVERTISEMENT

అయితే ప్రేమ, పెళ్ళి విఫలమైందనో లేదా ప్రేమ పేరుతో ఎవరో వేదిస్తున్నారనో లేదా అత్తారింట్లో వరకట్నం వేధింపుల వల్లనో ఆమె ఆత్మహత్య చేసుకోలేదు.

చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రికి చికిత్స చేయించేందుకు అవసరమైన సొమ్ము సమకూర్చేందుకు ఆత్మహత్య చేసుకుంది!

దీని కోసం ఆమె ముందుగా తన పేరిట రూ.60 లక్షలకి యాక్సిడెంట్ కవరేజ్ పాలసీ తీసుకుని, ఆ తర్వాత ప్రాణం తీసుకుంది.

ఇంతకంటే విచారకరమైన విషయం ఏమిటంటే, ఆత్మహత్య చేసుకుంటే ఇన్స్యూరెన్స్ క్లెయిమ్‌ లభించదనే విషయం ఆమెకి తెలియకపోవడం!

ఇంకా కంట తడిపెట్టించే విషయం ఏమిటంటే, సూసైడ్ లెటర్‌లో తాను ఆత్మహత్య చేసుకున్నాననే విషయం బయటపెట్టకుండా పాము కాటు లేదా కరెంట్ షాకుతో చనిపోయానని చెప్పి, ఇన్స్యూరెన్స్ డబ్బుతో తండ్రికి వైద్యం చేయించమని వ్రాసిపెట్టడం.

ఆ లేఖని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సూసైడ్ లెటర్‌లో ఆమె స్వయంగా లిఖితపూర్వకంగా ఇన్స్యూరెన్స్ క్లెయిమ్‌ కోసమే ఆత్మహత్య చేసుకున్నానని, కానీ ఈ విషయం దాచిపెట్టి డబ్బు తీసుకోవాలని వ్రాసినందున, అది ఇన్స్యూరెన్స్ కంపెనీని మోసం చేసే ప్రయత్నంగానే పరిగణింపబడుతుందనే విషయం ఆమెకు తెలియకపోవడం అమాయకత్వమే అనుకోవాలేమో.

మరో విషయం ఏమిటంటే, సచివాలయంలో పని చేస్తున్న ఆమెకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పధకం కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందేందుకు హెల్త్ కార్డులు ఇస్తోందనే విషయం తెలిసే ఉండాలి.

ఒకవేళ ఆమె కుటుంబానికి అర్హత లేనట్లయితే, సచివాలయం ద్వారానే లేదా సోషల్ మీడియా ద్వారా సిఎం, డెప్యూటీ సిఎం లేదా మంత్రులకు తన తండ్రి పరిస్థితి తెలియజేస్తే ఎవరో ఒకరు సహాయపడకపోరు.

ఒకవేళ ఆమె ఆ ప్రయత్నాలు చేసి ఫలించకపోయి ఉంటే ఉచితంగా వైద్య చికిత్స అందిస్తున్న పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వంటివి దక్షిణాది రాష్ట్రాలలో కొన్ని ఉన్నాయి. అక్కడ తండ్రిని చేర్పించి ఆయన ప్రాణం కాపాడుకోవచ్చు.

కానీ ఇన్స్యూరెన్స్ డబ్బుతో తండ్రికి వైద్యం చేయించి కాపాడుకోవాలని పాపం ఆ అమాయకురాలు ఆత్మహత్య చేసుకుంది.

కానీ తన మరణంతో ఆమె ఆశించినదేదీ జరుగకపోగా, తల్లితండ్రులకి, కుటుంబ సభ్యులకు తీరని మనోవేదన మిగిల్చింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడే ప్రమాదం కూడా ఏర్పడింది.

ADVERTISEMENT
Latest Stories